పద్మశ్రీలపై బ్రహ్మానందం, మోహన్ బాబులకు షాక్
హైదరాబాద్: ప్రముఖ సినీ నటులు బ్రహ్మానందం, మోహన్ బాబులకు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. తమకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డులను వారంలోగా తిరిగి ఇచ్చేయాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హైకోర్టు వారిని ఆదేశించింది. పద్మశ్రీ అవార్డులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.
దేనికైనా రెడీ సినిమా విషయంలో వారిద్దరు పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బిజెపి నేత ఎన్ ఇంద్రసేనా రెడ్డి హైకోర్టులో నిరుడు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై వాదోపవాదాలు విన్న హైకోర్టు సోమవారం ఆ ఆదేశాలు జారీ చేసింది.
దేనికైనా రెడీ సినిమా టైటిల్స్ విషయంలో బ్రహ్మానందం, మోహన్ బాబు పద్మశ్రీ అవార్డులను ఇంటి పేరు మాదిరిగా వాడి దుర్వినియోగం చేశారని ఇంద్రసేనా రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను ఇంద్రసేనా రెడ్డి తరఫు న్యాయవాది ఉటంకించారు. తాము దుర్వినియోగానికి పాల్పడలేదని బ్రహ్మానందం, మోహన్ బాబు తరఫు న్యాయవాదులు వాదించారు.
మోహన్ బాబుకు 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి 2010లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. హైకోర్టు తాజా తీర్పుపై మోహన్ బాబు, బ్రహ్మానందం సుప్రీంకోర్టుకు వెళ్తారా, ఏం చేస్తారనేది ఇప్పుడే తెలియడం లేదు.