రైలు ప్రమాదం: హెల్త్ బులెటిన్, చిన్నారుల తారుమారు
హైదరాబాద్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసెంజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల పైన వైద్యులు శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
విద్యార్థులలో వరుణ్ గౌడ్, తరుణ్, వైష్ణవిల ఆరోగ్యం విషమంగా ఉందని చెప్పారు. వారిని వెంటిలెటర్ల పైన ఉంచినట్లు చెప్పారు. ఆరుగురి విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని, రుచిత, పాతిమల ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు చెప్పారు.
గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 16 మంది చనిపోగా గాయపడిన 20 మందిని సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఏడుగురికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. మరో తొమ్మిది మంది చిన్నారుల ఆరోగ్యం క్రమంగా కుదుట పడుతోందని వారిని పరిశీలనలో ఉంచామని వైద్యులు తెలిపారు.
కాగా, మృతదేహాల అప్పగింతలో అధికారుల పొరబాటుతో అందరూ చనిపోయాడని భావించిన చిన్నారి ధనుష్ బతికే ఉన్నాడు. ప్రస్తుతం అతడు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మాసాయిపేట ఘటనలో ధనుష్ చనిపోయాడంటూ అధికారులు ఇస్లాంపూర్కు చెందిన దత్తు అనే విద్యార్థి మృతదేహాన్ని అప్పగించారు. అది తమ బిడ్డ మృతదేహమేననుకున్న వారు అంత్యక్రియలు జరిపారు. అయితే, ధనుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్న వార్తతో ఆ చిన్నారి తల్లిదండ్రులు హుటాహుటీన సికింద్రాబాద్ వచ్చారు. చికిత్స పొందుతున్నది తమ కుమారుడేనని నిర్ధారించుకుని ఆనందభాష్పాలు రాల్చారు.