దోపిడీ దొంగల బీభత్సం: దాడి చేసి ఇల్లు దోపిడీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి సమీపంలోగల రాయపాడు శివారులోని కల్పతరువు కాలనీలో మంగళవారం వేకువజామున దోపిడీదొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లోనివారిపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు.
వనపర్తి సురేష్ ఇంటి తలుపులు ప గులగొట్టి లోపలకు ప్రవేశించి నిద్రపోతున్న నలుగురిపై రాడ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దాంతో కుటుంబసభ్యులు కేకలు వేయటంతో పొరుగు ఇళ్లలోని వారు బయటకురాగా దొంగలు వారిపై రాళ్లు రువ్వడంతో ప్రాణభయం తో ఇళ్లలోకివెళ్లి తలుపులు వేసుకున్నారు.
ఈలోగా దొంగలు బీరువాల్లోని రూ. ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండిని అపహరించి పారిపోయారు. దొంగల దాడిలో గాయపడ్డ సురేష్, ఆయన భార్య జయంతి, కుమార్తె యశోద, కుమారుడు సంతోష్లు అపస్మారకస్థితిలోకి చేరుకున్నారు. స్థానికులు సురేష్ కుటుంబసభ్యులను గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన విధానాన్ని పరిశీలించారు. దాడిలో 10 మంది దొంగలు పాల్గొన్నట్లు తెలుస్తుంది. వీరంతా హిందీ, బీహర్ భాషలో మాట్లాడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆధారాలు సేకరించేందుకు పోలీసులు డాగ్స్క్వాడ్ రప్పించారు. క్లూస్ టీం వేలిముద్రలను సేకరించారు.