గూగుల్ మ్యాప్స్తో 56 మంది అనుమానితుల పట్టివేత
హైదరాబాద్: కార్డోన్, సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు గూగుల్ మ్యాప్స్ సహకారంతో 56 మంది అనుమానితులను పట్టుకున్నారు. మంగళవారంనాడు దాదాపు 350 మంది పోలీసులు హైదరాబాదులోని మంగోడ్ బస్తీలో ఇంటింటి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ బస్తీ నేరగాళ్లకు ఆలవాలమని భావిస్తారు.
గూగుల్ మ్యాప్స్ సహకారంతో నేరగాళ్లను పట్టుకోవడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. పోలీసులు పట్టుకున్నవారిలో మహిళలు కూడా ఉన్నారు. పోలీసుల చేతికి చిక్కినవారిలో దొంగలు, పిక్ ప్యాకెట్ నేరగాళ్లు, ద్విచక్రవాహనాల దొంగలు ఉన్నారు.
రెండు హత్య కేసుల్లో నిందితులైన ముగ్గురు కూడా పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. పోలీసులు 35 బృందాలుగా ఏర్పడి మల్లేపల్లి ప్రాంతంలో గల బస్తీలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులకు స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రతిఘటించినవారిలో మహిళలు కూడా ఉన్నారు. ఆత్మాహుతి చేసుకుంటామని కూడా కొంత మంది బెదిరించారు.
మహిళా పోలీసులు రంగంలోకి దిగి మహిళల మీద పైచేయి సాధించారు. పోలీసులు నగదు, విలవైన వస్తువులు, ద్విచక్రవాహనాలు, పంప్ మోటార్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదును నేరాలు లేని నగరంగా చేయడమే తమ ఉద్దేశమని హైదరాబాద్ పశ్చిమ మండలం డిప్యూటీ పోలీసు కమిషనర్ వి. సత్యనారాయణ మీడియాతో చెప్పారు.
నేరగాళ్లను లక్ష్యం చేసుకుని, ప్రజలకు విశ్వాసం కలిగించడానికి మాత్రమే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.