హైదరాబాద్లో ఆంధ్రులకు అధికారాలుండవు: కవిత
హైదరాబాద్: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదని, కామన్ క్యాపిటల్ మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లో ఆంధ్రులకు ప్రత్యేక అధికారాలు అంటూ ఏమీ ఉండవని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల జెఎసి సమావేశం మంగళవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ప్రసంగించారు.
బంగారు తెలంగాణ సాధనకు అందరం కలిసికట్టుగా పని చేద్దామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినట్టుగానే పభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సైతం తెలంగాణ ఇంక్రిమెంట్ లభించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తానని తెలిపారు.
ఉద్యోగుల విభజన విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని వివరిస్తూ ముఖ్యమంత్రి రాసిన లేఖను తీసుకొని ఎంపిలంతా కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని కవిత తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైన భవిష్యత్తు ఉందని, హైదరాబాద్ అభివృద్ధికి విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని కవిత తెలిపారు.
ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్పై విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మంగళవారం సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై దృష్టిసారించినట్టు ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఎంఈవో, డైట్ లెక్కరర్ల ఖాళీలను ఈ నెలలోనే భర్తీ చేయనున్నట్టు తెలిపారు.
మే నెలలో బదిలీ అయిన వారి రిలీవింగ్ వచ్చే నెలలో చేయనున్నారు. ఇటీవల మార్చిన పాఠశాలల వేళలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త వేళలను పాటించాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి.