పలాయనవాదం కాదు, పదవులు కాదు: కిరణ్ రెడ్డి
చిత్తూరు: ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పలాయనవాదం కాదని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పోటీ చేయకపోవడంపై సన్నిహితులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. పదవుల కోసం పాకులాడడం లేదని చెప్పడానికి మాత్రమే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన అన్నారు. తన సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి చేత పీలేరు శాసనసభా నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయించిన తర్వాత ఆయన శనివారం పీలేరులో రోడ్ షో నిర్వహించారు.
తెలుగుజాతిని మోసం చేసిన తెలుగుదేశం, బిజెపిలకు ఓటు వేయవద్దని ఆయన ప్రజలను కోరారు. విభజన చేసినందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓటేస్తారా అని ఆయన అడిగారు. విభజన చేయాలని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కూడా ఓటు వేయవద్దని ఆయన సూచించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్రం సమైక్యంగా ఉండడమే తనకు కావాల్సిందని ఆయన అననారు.
రాష్ట్ర సమైక్యత కోసం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని మరిచిపోవద్దని ఆయన అన్నారు. తన మాట వినకుండా, శాసనసభ తీర్మానానికి విలువ ఇవ్వకుండా రాష్ట్రాన్ని విభజించారని ఆయన విమర్శించారు. డబ్బులు ఇచ్చేవాళ్లకు ఓటు వేయకూడదని ఆయన ప్రజలను కోరారు. డబ్బులు ఇస్తే తీసుకోవాలి గానీ వారికి ఓటు వేయవద్దని ఆయన అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులు ఇచ్చి ఓటు కోరుతారని ఆయన చెప్పారు.
తెలుగుజాతి భవిష్యత్తునూ మీ భవిష్యత్తనూ దృష్టిలో ఉంచుకుని జై సమైక్యాంధ్ర పార్టీకి ఓటేయాలని ఆయన కోరారు. మన పాదాలను చెప్పులు రక్షించినట్లుగా ప్రజలను తమ జై సమైక్యాంధ్ర పార్టీ రక్షిస్తుందని ఆయన అన్నారు. తెలుగుజాతిని అవమానించినవారికి, రాష్ట్ర విభజనకు కారణమైనవారికి గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.