థానేకే కాదు, ఎక్కడికైనా వెళ్తా: అక్బర్, టీపీసీసీపై వివేక్
హైదరాబాద్: తాను ప్రజాప్రతినిధిగా దేశంలో ఎక్కడికైనా వెళ్తానని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం చెప్పారు. థానే పోలీసు కమిషనర్ ఇచ్చిన సీఆర్పీసీ సెక్షన్ 144 నోటీసును తీసుకున్న అక్బరుద్దీన్ తిరిగి సమాధానమిచ్చారు. తన థానే పర్యటన ఆగదని చెప్పారు.
ప్రజాప్రతినిధిగా తాను దేశంలోని ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్లే హక్కు ఉందని చెప్పారు. మహారాష్ట్రలో బలోపేతం అవుతున్న మజ్లిస్ పార్టీని అడ్డుకునేందుకు, రాజకీయ దురుద్దేశ్యంతో తన పర్యటనను అడ్డుకునేందుకు ఈ నోటీసు ఇచ్చారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తన పర్యటన ఆగదన్నారు.
ఔరంగాబాద్, దౌలతాబాద్, ముంబై, ఉత్తర ప్రదేశ్లలో పర్యటిస్తానని చెప్పారు. ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని చెప్పారు. తానే పోలీసు కమిషనర్ నోటీసు పైన తాము మహారాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు.
రాజధానిపై రఘువీరా
ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన పారదర్శకత లోపిస్తోందని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి వేరుగా అన్నారు. రుణమాఫీ పైన ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతోందన్నారు. సీఎం, మంత్రులు చెప్పే మాటలకు పొంతన లేదన్నారు. ప్రభుత్వ ప్రకటనలతో రైతులు, డ్వాక్రా మహిళలు అయోమయానికి గురవుతున్నారన్నారు. టీడీపీ హామీలన్ని నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం మెడలు వంచి అయినా రుణమాఫీ చేయిస్తామన్నారు.
సోనియా ఆదేశిస్తే..: వివేక్
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశిస్తే తాను పీసీసీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమని మాజీ ఎంపీ వివేక్ హైదరాబాదులో అన్నారు. తెలంగాణ ఇచ్చిన అంశాన్ని తాము ప్రజల్లోకి తీసుకు వెళ్లలేకపోయామన్నారు.