పొలిటిక్స్: పవన్ కళ్యాణ్ జోష్, నాగబాబు విముఖత
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వైఫల్యంతో రాజకీయాల పట్ల ఆయన సోదరుడు, నటుడు నాగబాబు విసుగు చెంది, వాటి పట్ల విముఖత ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తున్నారు. మరో సోదరుడు పవన్ కళ్యాణ్ మాత్రం చాలా రోజులు రాజకీయాలకు దూరంగా ఉండి, తనదైన శైలిలో ముందుకు వచ్చి రాజకీయాల్లో జోష్ ప్రదర్శిస్తున్నారు. మున్ముందు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పెద్ద పాత్రనే పోషించే అవకాశం ఉండగా, రాజకీయాలకు తాను దూరంగా ఉండాలని నాగబాబు అనుకుంటున్నట్లు అర్థమవుతోంది.
కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సోదరుడు నాగబాబు రాజకీయాల పట్ల తీవ్ర విముఖత ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు టీవీ చానెళ్లలో ఆయన ప్రముఖంగా కనిపిస్తున్నారు. సీతామహాలక్ష్మి అనే టీవీ సీరియల్ను ఆయన నిర్మిస్తున్నారు. దాంతో పాటు జబర్దస్త్ కామెడీ షోలో ఆయన రోజాతో పాటు జడ్జిగా కనిపిస్తున్నరాు.
ఇటీవలే ఆయన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో నాగబాబు ఖాతా తెరిచారు. రాజకీయాల్లోకి మళ్లీ వెళ్తారా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన కచ్చితమైన సమాధానం ఇచ్చారు. కొన్నేళ్ల క్రితం తన సోదరుడు చిరంజీవి రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు తాను మద్దతు ఇస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో చాలా మార్పులు వచ్చాయని ఆయన అన్నారు.
తాను కాంగ్రెసులో సభ్యుడిగానే ఉన్నానని, అయితే తనకు తన సోదరుడితో తప్ప వేరే ఎవరితోనూ సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తన సొంత సినిమా ఆరెంజ్ అపజయం తనకు పెద్ద దెబ్బ అని, దీంతో తన కుటుంబం గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, వేరే విషయాల కన్నా తనకు అది ముఖ్యమని ఆయన అన్నారు.
చెప్పాలంటే నిజానికి, తనకు రాజకీయాలపై భ్రమలు తొలగిపోయాయని, తాను తిరిగి రాజకీయాల్లోకి వెళ్తానని అనుకోవడం లేదని అన్నారు. ముందు ప్రజలు మారాలని, అప్పుడే రాజకీయ వ్యవస్థలో ఏమైనా చేయగలమని, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదని ఆయన అన్నారు. ప్రస్తుతం టీవీ, సినిమాలతో తాను ఆనందంగా ఉన్నట్లు చెప్పారు.