రాజ్యసభకు లేదా గవర్నర్గా వెళ్లాలని...: యనమల
హైదరాబాద్: తాను రాజ్యసభ సభ్యుడిగా లే ఓ రాష్ట్రానికి గవర్నర్గా వెళ్లాలని అనుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే తమ పార్టీ నాయకులు మంత్రివర్గంలో ఉండాలని కోరడంతో ఆర్థికమంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
తన మొదటి ఆప్షన్ మాత్రం రాజ్యసభకే ఉండేదని యనమల రామకృష్ణుడు వెల్లడించారు. కేంద్రం ప్లానింగ్ కమిషన్ బదులు అందర్ రాష్ట్ర కౌన్సిల్ను పునరుద్ధరిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు.
ఇది ఇలా ఉండగా, శనివారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో యనమల మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బఫూన్ల వ్యాఖ్యలపై సభకు క్షమాపణ చెబితే గౌరవంగా ఉంటుందని అన్నారు.
శాంతి భద్రతల అంశంపై రెండో రోజూ కూడా శాసనసభలో దుమారం రేగింది. సిఎంలు, స్పీకర్లూ గతంలో క్షమాపణలు చెప్పిన ఘటనలు ఉన్నాయని యనమల ఈ సందర్భంగా గుర్తు చేశారు.