జగన్ పిలిస్తేనే కలుస్తా, లేదంటే అంతే: ఎంపీ గీత
తనకు స్థానిక నాయకులతో ఉన్న సమస్యలను ఇది వరకే జగన్కు చెప్పానని, అందువల్ల మరోసారి చెప్పాల్సిన అవసరం లేదని, అందువల్ల జగన్ పిలిస్తేనే తాను వెళ్లి కలుస్తానని ఆమె చెప్పారు. తాను సోమవారం హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిని కలిశానని, తిరిగి వెళ్తున్నానని, జగన్ పిలిస్తే ఈసారి వచ్చినప్పుడు ఆయనను కలుస్తానని ఆమె ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.
పార్టీ మారే ఆలోచన తనకు లేదని, అయితే ఆత్మగౌరవం దెబ్బ తింటే తీవ్ర నిర్ణయం తీసుకోక తప్పదని ఆమె అన్నారు. తనకు స్థానిక నాయకులు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తన ఆత్మగౌరవం దెబ్బ తింటోందని, వారితో ఉన్న ఇబ్బందులను ఇప్పటికే జగన్కు చెప్పానని ఆమె అన్నారు. జగన్ పిలిసి మాట్లాడడానికి తాను గడువు ఏదీ పెట్టడం లేదని చెప్పారు.
తన అసంతృప్తిని చెప్పానని, తాను శ్రీకాకుళం పర్యటనలో జగన్కు తన అసంతృప్తి తెలియజేశానని, అప్పుడు జగన్ తాను చెప్పిందాంట్లో నిజం ఉందని అంగీకరించారని ఆమె అన్నారు. అప్పుడు చెప్పిన తర్వాత చర్యలు తీసుకుంటారని తాను భావించానని, అయితే జగన్ ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని గీత అన్నారు.
తనలాంటి వాళ్లు పార్టీలో చాలా మంది ఉన్నారని, వారు తనను అభినందిస్తున్నారని, మీరు చెప్పారు గానీ మేం చెప్పలేకపోతున్నామని వారన్నారని గీత చెప్పారు. తాను పార్టీ అధ్యక్షుడికి విధేయంగానే ఉన్నానని ఆమె అన్నారు. బిజెపికి, తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ ఉందని, తాను ఆ పార్టీల్లోకి వెళ్లడం వల్ల ఆ పార్టీలకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని, తమకు కూడా పదవులు వస్తాయని అనుకోవడం లేదని ఆమె అన్నారు.