హరికి బాబు చేయి: మీడియా ముందుకు ఎన్టీఆర్
హైదరాబాద్: ఎన్నికల వాతావరణం వేడెక్కిన వేళ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రేపు గురువారం మీడియా ముందుకు రానున్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడానికి సిద్దమవుతున్నారని ఇదివరకే వార్తలు వచ్చాయి. అయితే, అది ఎంత వరకు నిజమనేది తెలియడం లేదు.
ఎన్నికల వేళ చెలరేగుతున్న ఊహాగానాలకు ఎన్టీఆర్ రేపు స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. టిడిపికి ప్రచారం చేయడానికి సిద్ధపడినట్లు వచ్చిన వార్తలు వెలువడినప్పటికీ వాటిలో ఎంత వరకు నిజం ఉందనేది తెలియడం లేదు. తాను ఎన్నికల ప్రచారానికి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో ఆయన వివరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తన తండ్రి నందమూరి హరికృష్ణకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన ప్రచారానికి దిగుతారనే వార్తల్లో అంతగా నిజం ఉండకపోవచ్చుననే మాట వినిపిస్తోంది. అయితే, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఆయన అనుకూలంగా ఉన్నట్లు చెబుతారు. ఆయన మధ్యేమార్గంగా వ్యవహరిస్తారా కూడా తెలియదు.
రాజంపేట లోకసభ స్థానంలో అత్తమ్మ దగ్గుబాటి పురంధేశ్వరికి ప్రచారం చేస్తారా అనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. ఎవరికి వారు పార్టీకి ప్రచారం చేయాలని, ఎవరినీ ప్రత్యేకంగా ప్రచారానికి పిలువబోమని బాలకృష్ణ హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లను ఉద్దేశించి అన్నారు. హరికృష్ణకు తగిన స్థానం కల్పిస్తామని కూడా ఆయన చెప్పారు.
అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హీరో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి తమ పార్టీకి ప్రచారం చేయాలని కోరారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగానే ఉంది.