హైద్రాబాద్ను మించి, గూగుల్ సహా: ఐటీపై పల్లె
విశాఖపట్నం: ఐటీ రంగంలో విశాఖపట్నంను హైదరాబాదును మించి అభివృద్ధి చేస్తామని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సోమవారం అన్నారు. టెక్ మహీంద్రా పదివేల ఉద్యోగాల హామీతో పెట్టుబడులకు ముందుకు వచ్చిందన్నారు. గూగుల్తో పాటు అనేక అంతర్జాతీయ కంపెనీలు విశాఖలో ఐటీ పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయన్నారు. రానున్న పదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలోని రుషికొండలో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించారు. కాగా, అనంతరం ఐటీసీఈవోల సదస్సులో పాల్గొని, ప్రసంగిస్తారు.
ఈ సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు బ్యాంకర్లతో సమావేశం కానున్నారు. ఏపీ రైతుల రుణమాఫీపై చర్చించనున్నారు. ముందుగా రైతుల బకాయిలలో కొంత మేర చెల్లించేందుకు వారి అనుమతి కోరనున్నారు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దశల వారీగా రైతు రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందని, కాబట్టి చెప్పినంత మేరకు రుణాలు మాఫీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరనుంది.
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నియామకాలు చేపడతామని ఏపీ ఆరోగ్య, వైద్య, విద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని మంత్రి సందర్శించి వసతులను పరిశీలించారు. జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.