అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ మూసా పట్టివేత
హైదరాబాద్ : ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ మూసాభాయ్ని అరెస్టు చేయడంలో పోలీసులు విజయం సాధించారు. ఎర్రచందనం దుంగల రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్ మూసను సోమవారం తమిళనాడులో నెల్లూరు అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పదికిపైగా కేసులు ఉన్నాయి. ఆయన పూర్తి పేరు మలియక్కల్ మూస(60).
గతంలో పలుమార్లు మూసను అరెస్టు చేసేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నించినా చాకచక్యంగా తప్పించుకునేవాడు. మరోవైపు తమిళనాడుకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు, ప్రముఖుల అండదండలు ఉండటంతో మూస ఉండే ప్రాంతంలో నెల్లూరు అటవీ శాఖ అధికారులు, పోలీసులు కాలుమోపలేని పరిస్థితి ఉండేదని విమర్శలున్నాయి.
ల్లూరు డీఎఫ్వో రాంబాబు, సివిల్ పోలీసుల సహకారంతో చెన్నై సమీపంలోని తిట్టేటి వద్ద ఓ ఇంటిలో స్మగ్లర్ మూస ఉండగా ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈయనపై పలు వారెంట్ కేసులు ఉన్నాయి. రూ.10 వేల కోట్ల ఆస్తిపరుడైన మూసకు తమిళనాడు పోలీసులతోపాటు రాజకీయనేతల అండదండలున్నాయి. మూస నేరసామ్రాజ్యం నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు విస్తరించింది. స్మగ్లర్ మూసను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుసుకున్న పలువురు తమిళనాడు న్యాయవాదులు సోమవారం నెల్లూరుకు చేరిపోయారు. మూసను విచారించాకే అరెస్టు చూపిస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
మూసా 2003లో అనేక నేరాలు చేసి పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తదుపరి బెయిల్పై బయటికి వచ్చారు. ఇతడిపై గతంలో నెల్లూరు జిల్లా గూడూరులో కేసు నమోదైంది. గూడూరు కోర్టుకు పలు దఫాలు వాయిదాకు రాని కారణంగా గూడూరు మేజిసేట్ అతనిని తక్షణం అరెస్టు చేయాలంటూ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. దీంతో నెల్లూరు జిల్లా వెంకటగిరి సబ్డీఎఫ్వో రవీంద్రనాథ్రెడ్డి నేతృత్వంలో మూడు రోజులుగా చెన్నైలో మకాం వేశారు. ఆదివారం అర్ధరాత్రి అతడి ఇంట్లోనే మూసాను అరెస్టు చేసి నెల్లూరుకు తీసుకువచ్చారు.