కేసీఆర్పై అస్త్రం: జగ్గారెడ్డి వెనుక పవన్కళ్యాణ్, ప్రచారం!
హైదరాబాద్: మెదక్ లోకసభ ఉప ఎన్నికల బరిలో భారతీయ జనతా పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి నిలబడుతున్న విషయం తెలిసిందే. జగ్గారెడ్డికి టిక్కెట్ జనసేన పార్టీ అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ చరిష్మా వల్ల కూడా వచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నిన్నటి వరకు జగ్గారెడ్డి కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. జగ్గారెడ్డి పేరును బీజేపీ ఖరారు చేయడం వెనుక పవన్ చరిష్మ ఉండవచ్చుని చెబుతున్నారు. బీజేపీ ముగ్గురు పేర్లను పరిశీలించింది. అయితే, చివరకు జగ్గారెడ్డి వైపు మొగ్గింది. జగ్గారెడ్డి వైప మొగ్గడం వెనుక సామాజికవర్గం కోణం కూడా ఉంది. కాంగ్రెస్, తెరాసలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాయి.
నాడే అనుమానం...
కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ను జగ్గారెడ్డి కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ టీడీపీ - బీజేపీ కూటమికి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం అతను పవన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కూడా జగ్గారెడ్డి పైన ప్రశంసలు కురిపించారు. దీనిపై చర్చ జరిగింది.
జగ్గారెడ్డి బీజేపీలో చేరి, మెదక్ లోకసభ టిక్కెట్ ఆశిస్తున్నందువల్లే ఆయనను కలిశారనే ప్రచారం జరిగింది. అయితే, తమ భేటీ సాధారణమేనని జగ్గారెడ్డి అప్పుడు చెప్పారు. బీజేపీకి ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ను నాడు జగ్గారెడ్డి కలవడం, ఇప్పుడు ఆయనకే టిక్కెట్ రావడంతో.. పవర్ స్టార్ వల్లేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ను ఎదుర్కోవాలంటే.. పవన్ మద్దతు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ధీటుగా ఎదుర్కోగలిగిన వ్యక్తి జగ్గారెడ్డియేనని, అంతేకాకుండా.. పవన్ ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తారని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పవన్ ప్రధానంగా కేసీఆర్ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగ్గారెడ్డిని నిలబెట్టడంతో ఆయన తరఫున, బీజేపీ తరఫున పవన్ ప్రచారం చేస్తారని అంటున్నారు. బీజేపీ తమ బలంతో పాటు జగ్గారెడ్డి బలం, పవన్ అభిమాన గణం, టీడీపీ మద్దతు పైన ఆశలు పెట్టుకుందంటున్నారు.