భద్రత తొలగింపు అన్యాయం: జగన్, ప్రాణహాని ఉందని..
హైదరాబాద్: తనకు కేటాయించిన జెడ్ కేటగిరి భద్రతను తొలగించడం అన్యాయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తనకున్న జెడ్ కేటగిరి భద్రతను తొలిగించి.. వ్యక్తిగత భద్రత సిబ్బంది(1+1), (1+1) ముఖ్య భద్రతాధికారిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ వైయస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు.
గత మూడేళ్ల నుంచి తనకు కొనసాగిస్తూ వచ్చిన జెడ్ కేటగిరి భద్రతను యథాతథంగా కొనసాగించేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఆయన సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, ఏపి డిజిపి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, కడప జిల్లా ఎస్పి, రాష్ట్రస్థాయి భద్రత సమీక్ష కమిటీలను జగన్ తన పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
మావోయిస్టుల నుంచి తన ప్రాణాలకు ముప్పు కొనసాగుతూ వస్తోందని జగన్ తెలిపారు. తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా తనకు జెడ్ కేటగిరి భద్రత కొనసాగించారని.. ప్రస్తుత ఏపి సిఎం, అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడుకి కూడా ఇదే రకమైన భద్రత కల్పించారని చెప్పారు. కొందరు రాజకీయ నాయకులకు ఇప్పటికీ జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తున్నారని అన్నారు. తనకు ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా ఉందని తెలిపారు.
అయితే సెప్టెంబర్ 13న ప్రతివాదులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా తనకున్న జెడ్ కేటగిరి భద్రతను ఉపసంహరించారని తెలిపారు. దీనిపై ఇప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వాలేదని చెప్పారు. హైదరాబాద్లో నివాసం ఉండే తాను.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండు రాష్ట్రాల్లోనూ తిరుగుతూ ఉంటానని, రాజకీయ దురుద్దేశంతోనే ఇరు ప్రభుత్వాలు కలిసి తన భద్రతను ఉపసంహరించుకున్నాయని పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని నిఘా వర్గాల నివేదికలు ధృవపరుస్తున్నా.. వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా భద్రతను ఉపసంహరించారని తెలిపారు.
రాజకీయ దురుద్దేశాలతో తనకు తొలగించిన జెడ్ కేటగిరి భద్రతను యథాతథంగా పునరుద్ధరించేలా ప్రతివాదులను ఆదేశించాలని జగన్మోహన్ రెడ్డి తన పిటిషన్లో కోర్టును కోరారు. ఇది ఇలా ఉండగా తనకు హైదరాబాద్లో ఉన్న (2+2) భద్రతను ఉపసంహరించి, ప్రకాశం జిల్లాలో (1+1) భద్రతను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి కూడా సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, వైయస్ జగన్ పిటిషన్పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.