కెసిఆర్ వల్లే సూసైడ్లు: జైరాం, పవన్ ఎందుకో: విహెచ్
హైదరాబాద్/కరీంనగర్: తెలంగాణలో ఆత్మహత్యలు కాంగ్రెసు పార్టీ వల్ల జరగలేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యల వల్లనే జరిగాయని కేంద్రమంత్రి జైరాం రమేష్ కరీంనగర్ జిల్లాలో వ్యాఖ్యానించారు. కెసిఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే పదకొండువందల మంది విద్యార్థులు చనిపోయారన్నారు.
కెసిఆర్, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీలు పెద్ద డ్రామా కళాకారులు అన్నారు. తెలంగాణలో తాము సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సుస్థిర పాలన కాంగ్రెసు పార్టీతోనే సుసాధ్యమని జైరాం ఈ సందర్భంగా చెప్పారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాదును భారత దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. తమ హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఇచ్చిన బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ఎందుకు ఇవ్వలేకపోయిందని ఆయన ప్రశ్నించారు.
పవన్ ఎందుకు: విహెచ్
మోడీ హవా నిజంగానే ఉంటే ఇక బిజెపికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ప్రశ్నించారు. చంద్రబాబుది కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు. ఈసారి కాంగ్రెసు పార్టీలో అగ్రకులాలకు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం లేదన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దక్కే అవకాశముందన్నారు. ముఖ్యమంత్రి పదవి రావాలంటే అదృష్టం ఉండాలన్నారు. తాను ముఖ్యమంత్రిని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజలను చంపి మోడీ ప్రధాని కావాలనుకుంటున్నారన్నారు. గోద్రాలో ఆయన చేసిందేమిటని ప్రశ్నించారు.