తెలంగాణ కుటుంబ పాలనకు కాదు: కెసిఆర్పై జైరాం
హైదరాబాద్: తెలంగాణ ఇచ్చింది కుటుంబ పాలన కోసం కాదని కాంగ్రెసు సీనియర్ నేత, కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఉద్దేశించి ఆయన ఆవిధంగా అన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కాంగ్రెసు నాయకుడే అవుతాడని ఆయన శనివారంనాడు అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటున్నారు.
అభద్రతా భావం కల్పిస్తున్న కెసిఆర్ సెటిలర్లకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అనుమానాలు రేకెత్తించింది కెసిఆరేనని ఆయన అన్నారు. సెటిలర్ల ఓట్లు పడవనే నైరాశ్యంలో కెసిఆర్ ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే సోనియా, రాహుల్ గాంధీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెసు పార్టీయేనని, ప్రజల మద్దతు తమ పార్టీకే ఉందని ఆయన అన్నారు. బంగారు తెలంగాణగా రూపుదిద్దడానికి తమకు అందరి మద్దతు కావాలని ఆయన అన్నారు కాంగ్రెసు స్వాతంత్ర్యం తెచ్చింది, తెలంగాణ ఇచ్చిందని ఆయన అన్నారు.
తెలంగాణలో సెటిలర్ల ఓట్ల కోసం తమ పార్టీ ఎప్పుడూ వెంపర్లాడలేదని ఆయన స్పష్టం చేశారు తెలంగాణ ఉద్యమం పేరుతో ఆందోళనకరమైన పరిస్థితులు కల్పించి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంది కెసిఆరేనని ఆయన విమర్శించారు.