లాఠీచార్జ్: కేసీఆర్పై జానా భగ్గు, షరతులొద్దని రఘువీరా
తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని జానా రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారని చెప్పారు. రిజర్వ్ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం నుండి రుణమాఫీ పైన ఎలాంటి స్పష్టత లేదని విమర్శించారు.విద్యుత్ సరఫరా పైన ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణలో మూడు నాలుగు గంటలు కూడా విద్యుత్ ఉండటం లేదన్నారు.
విద్యుత్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఏపీఎస్సీసీ ద్వారానైనా ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే 80 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. విద్యార్థుల పైన లాఠీఛార్జ్ చేసి, కేసులు పెడతారా అన్న తెరాస ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు అన్ని రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు షరతులు విధించడం సరికాదని రఘువీరా రెడ్డి అన్నారు. ప్రభుత్వం హామీని నిలబెట్టుకోనందున ఆగస్టు 4వ తేదీన కలెక్టరేట్ల వద్ద కాంగ్రెసు పార్టీ నిరసనలు చేపడుతుందన్నారు. ఫీజురీయింబర్సుమెంట్స్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పైన చంద్రబాబు దిగి రాకుంటే ప్రజా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు షరతులు విధిస్తే చూస్తూ ఊరుకోమన్నారు.