అధికారం లేక ఏడుస్తుంటే: జానా, ఇదా: కేసీఆర్పై కిషన్
హైదరాబాద్: అధికారమే లేక ఏడుస్తుంటే ఇక ఆధిపత్య పోరు ఎక్కడిదని తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత జానా రెడ్డి బుధవారం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఆధిపత్య పోరు అంశంపై ఆయన స్పందించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యతో ఆయనకు ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు.
అధికారమే లేదు ఇక ఆధిపత్య పోరు ఎక్కడిదన్నారు. ఆధిపత్య ధోరణి ఉండాల్సిన అవసరం లేదన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కోరితేనే తాను గెట్ టు గెదర్ ఏర్పాటు చేశానని తెలిపారు. దానిని ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దని చెప్పారు. తాను తన భేటీని రద్దు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశం పొన్నాల నిర్వహిస్తారన్నారు. పొన్నాలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆధిపత్య పోరు కేవలం అపోహలే అన్నారు. తామిద్దరం పరస్పరం మాట్లాడుకుంటున్నామని చెప్పారు.
విద్యార్థుల జీవితాలు బలి చేయొద్దు: కిషన్ రెడ్డి
ఫీజు రీయింబర్స్మెంట్ పైన తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి వేరుగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం అలసత్వంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడరాదని సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. సమస్యను పరిష్కరించడానికి కేసీఆర్ చొరవ తీసుకోవాలన్నారు.
తెలంగాణేతరుల విద్యార్థులు 40వేలమంది ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని, వారి స్థానికత విషయంలో జరపాల్సింది జరిపించి, 40వేలమందిపై నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం, వారి కోసం తెలంగాణలోని 14 లక్షల విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో పడేస్తోందన్నారు.
విద్యార్థుల స్థానిక విషయంలో దేశంలోని 27 రాష్ట్రాల్లో ఏ ప్రాతిపదికన నిబంధనలు ఉంటాయో మన రాష్ట్రానికి కూడా అవే నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసునన్నారు. 1956కు ముందు ఇక్కడే పుట్టినట్లు నిరూపించుకుంటేనే ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని అనడం సరికాదని, తెలంగాణేతరులే కాదు తెలంగాణ వారు కూడా 1956కు ముందు జన్మించినట్లు రికార్డులు తేలేని వారు 95 శాతం మంది ఉన్నారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తలాతోక లేని నిర్ణయాలు తీసుకోకూడదని, సర్కార్ నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారన్నారు. ఐదారేళ్లుగా తెలంగాణ కోసం ఉద్యమం చేసిన విద్యార్థులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఇదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్లు స్థానిక విషయంలో ఆలోచన చేశారా? అంటూ ప్రశ్నించారు. ఇతర దేశాల పౌరసత్వం ఉన్నవాళ్లు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలు అయ్యారని, తెలంగాణ విద్యార్థులకు మాత్రం ఈ నిబంధనలు ఎందుకన్నారు.
మంగళవారం కూడా కిషన్ రెడ్డి కేసీఆర్ పైన నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇంత అహంకారమా? తొందరగా అధికారంలోకి వచ్చామని అహంకారపూరితంగా మా ట్లాడుతారా? అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ మొక్కటే ఉండాలా? ఇతరులెవరూ ఉండకూడదా? ఎన్నటికైనా వారిని గద్దె దింపి అధికారంలోకి వచ్చేది తామేనని గుర్తుంచుకోవాలన్నారు.
పోలవరం బిల్లు నేపథ్యంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు బీజేపీని విమర్శిస్తున్నారని, బీజేపీ ఒక పార్టీయా, దానికి ఒక అధ్యక్షుడా? ఒక కార్యాలయమా? అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని, అధికారంలోకి వచ్చామని ఏం మాట్లాడినా చెల్లుతుందా? తెలంగాణలో కేసీఆర్ కుటుంబమొక్కటే ఉండాలా? ఎవరూ ఉండకూడదా? బీజేపీ తెలంగాణ కోసం ఉద్యమించలేదా? మీరెంత పోరాటం చేశారో మేమూ అంతే చేశామన్నారు. మీకంటే ఎక్కువగానే ఉద్యమించామన్నారు.
ఢిల్లీలో ధర్నాలు చేసి లాఠీ దెబ్బలు తిన్నామన్నారు. అలాంటిది బీజేపీ కార్యాలయంపై దాడులు చేయిస్తారా? మీరు అధికారంలో తాత్కాలికంగా ఉండవచ్చునని, కానీ మీ అధికారాన్ని మార్చి అధికారంలోకే వచ్చేది తామే అన్నారు. కొత్త ప్ర భుత్వం వచ్చిందని, ఇప్పుడే విమర్శలు చేయకుండా కొంతకాలం ఆగుదామనుకున్నామని చెప్పారు.