పిసిసి: అధిష్టానంపై జానా ఆగ్రహం, చల్లబర్చిన సోనియా
దీనిపై డిగ్గీని ప్రశ్నించారట. అధ్యక్షుడిగా పొన్నాల, ప్రచార కమిటీ అధ్యక్షుడిగా దామోదర రాజ నర్సింహ నియామకాలను జానారెడ్డి ప్రశ్నించారని తెలుస్తోంది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని తనకంటే జూనియర్లకు కూడా ఉన్నత పదవులు కట్టబెట్టడం, తనకు ఎలాంటి పదవీ లేకుండా చేయటం ఏమిటని నిలదీశారట. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావించే ప్రచార కమిటీ చైర్మన్ను కూడా నియమించటంతో ఇక తనకు పార్టీ ఎలాంటి ప్రాధాన్యం ఇస్తోందో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తనలాంటి వారినే పక్కనపెడితే ఇక పనిచేసే కార్యకర్తలకు ఎలాంటి సంకేతాలను ఇచ్చినట్లు అవుతుందని ప్రశ్నించారట. అయితే, జానా రెడ్డిని సముదాయించేందుకు దిగ్విజయ్ అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ, జానా రెడ్డి అలక వీడక పోవటంతో ఆయన్ను తీసుకుని నేరుగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్దకు తీసుకు వెళ్లారు. సీనియర్ నేతగా న్యాయం చేస్తామని ఆయనకు సోనియా హామీ ఇచ్చారట.
సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే పిసిసి కమిటీలను నియమించామని, కమిటీల కూర్పు అంతా సామాజిక సమీకరణాల మేరకు చేయాల్సి వచ్చిందని సోనియా వివరించారట. తెలంగాణలో సీనియర్ నేతగా ప్రాధాన్యం తగ్గకుండా చూస్తానని జానాకి సోనియా హామీ ఇచ్చినట్లు సమాచారం.
కాగా, సోనియాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడేందుకు జానారెడ్డి విముఖత ప్రదర్శించారు. కానీ, దిగ్విజయ్ మాట్లాడారు. జానారెడ్డి వంద శాతం కాంగ్రెస్కు విశ్వాసపాత్రుడని, ఆయనకు ఎలాంటి అసంతృప్తీ లేదన్నారు. సోనియాతో భేటీ తర్వాత జానా చల్లబడినట్లుగా తెలుస్తోంది.