పవన్ ట్విస్ట్: జగన్పై ప్రశ్న, వారికి షాక్, చిరుకు ధీటుగా
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన తొలి ప్రచార సభలో అదరగొట్టారు. రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత పవన్ బుధవారం కర్నాటక ఎన్నికల ప్రచారంలో తొలిసారి పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న పవన్ను చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అభిమానులను అదుపులో పెట్టేందుకు ఒకటి రెండు చోట్ల పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.
ఆయన సోదరుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి గత ఉప ఎన్నికల్లో కర్నాటకలో ప్రచారం చేశారు. సోమవారం కూడా బెంగళూరులో రోడ్డు షో నిర్వహించారు. చిరు ప్రచారానికి ధీటుగా పవన్ ప్రచారం చేశారు. చిరుకు పోటెత్తినట్లుగానే అభిమానులు, ప్రజలు పవన్ కోసం తరలి వచ్చారు. చిరు కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయగా.. పవన్ బిజెపి అభ్యర్థులకు, మోడీ కోసం ప్రచారం చేశారు.
పవన్ కర్నాటకలో ఆంధ్రప్రదేశ్లోని పలు అంశాల పైన స్పందించారు. తెలుగు జాతిని చీల్చిన పాపం కాంగ్రెసు పార్టీదేనని మండిపడ్డారు. అంతేకాకుండా తానెవరికి మద్దతిచ్చేది మరింత స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో బిజెపి-టిడిపి కూటమి గెలుపు కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. అయితే, మల్కాజిగిరి విషయంలో మాత్రం టిడిపి-బిజెపి కూటమికి షాకిచ్చారు.
తాను మల్కాజిగిరి బరిలో నిలబడుదామనుకున్నానని అయితే, లోక్సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ కోసం విరమించుకున్నానని చెప్పారు. మల్కాజిగిరిలో తన మద్దతు జెపికేనని చెప్పారు. జెపి తరఫున తాను ప్రచారం చేస్తానని తెలిపారు.
మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ పోటీ విషయమై మాట్లాడుతూ... పరోక్షంగా జగన్ పైన విమర్శలు గుప్పించారు. పొట్లూరి మంచి వ్యక్తి అని, తన స్నేహితుడు అని చెబుతూ... ఏళ్ల కొద్ది జైల్లో ఉన్న వారు పోటీ చేయగా లేనిది పొట్లూరి పోటీ చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. అయితే, తాను టిడిపి అభ్యర్థుల విషయంలో జోక్యం చేసుకోవడం లేదని చెప్పారు.