రాజధానికి విరాళాలు: జనసేన హెచ్చరిక
హైదరాబాద్: ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. సామాజిక వెబ్సైట్లలో జనసేన పార్టీ పేరిట, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొంది.
పార్టీ పేరుతో కానీ, పార్టీ అధ్యక్షుడి పేరిట కానీ ఆంధ్రప్రదేశ్ పునర్ణిర్మాణం కోసం విరాళాలు వసూలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలా విరాళాలు సేకరించే వారు ఎవరైనా అభిమానులు, కార్యకర్తల దృష్టికి వస్తే తెలియజేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జనసేన పార్టీకి ఎన్నికల సంఘం నుంచి పూర్తిస్థాయి గుర్తింపు వచ్చిన తరువాత పార్టీ భవిష్యత్ ప్రణాళిక స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా జనసేన పేరును దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ప్రశ్నిచడానికి వస్తానని ఘనంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ ధరలు పెరుగుతున్నా ప్రశ్నించడానికి రాలేదేంటంటూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పెడుతూ వ్యతిరేక ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దీనిపై స్పందించి ఈ ప్రకటన విడుదల చేసి ఉంటారని అంటున్నారు.