బాధపడ్డ జయసుధ, మజ్లిస్తో కటీఫ్, గీతకి టీడీపీ ఒకే..
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలోని విభేదాల వల్లనే తాను ఓడిపోయానని మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ అన్నారు. కాంగ్రెసు పార్టీలో కుమ్ములాటలే ఎన్నికల్లో ఓటమికి కారణాలని వాపోయారు. నిజమైన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
యూత్ కాంగ్రెసు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనైనా యూత్ కాంగ్రెస్కు ఎన్నికలు జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 2009లో కాంగ్రెసు పార్టీ ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేసిన జయసుధ పోటీ చేసి తొలిసారే గెలుపొందారు. అయితే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూశారు.
మజ్లిస్తో కటీఫ్
మజ్లిస్ పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. మజ్లిస్ పార్టీ అవసరం ఉన్నప్పుడు దగ్గరగా లేదంటే దూరంగా వెళ్తుందని టీ కాంగ్రెసు నేతలు అభిప్రాయపడ్డారు. అలాంటి పార్టీకి దూరంగా ఉండటమే బెట్టర్ అని నిర్ణయించుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించారు.
'కొత్తపల్లి గీత వస్తే ఆహ్వానిస్తాం'
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత తమ పార్టీలోకి వస్తే తాము ఆహ్వానిస్తామని తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థానిక నాయకత్వంపై గీత అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.
ఆదివారం ఉదయం కొత్తపల్లి గీత మంత్రి అయ్యన్నపాత్రుడితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో ఉన్న విభేదాల నేపథ్యంలో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.