నటుడు జీవాకు గాజువాక అసెంబ్లీ టిక్కెట్పై చిరు హామీ
హైదరాబాద్: తమ పార్టీలో చేరిన ప్రముఖ తెలుగు నటుడు జీవాకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ ఇస్తామని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి గురువారం అన్నారు. జీవా గురువారం కాంగ్రెసులో చేరారు. ఆయన చేరికపై చిరు స్పందిస్తూ.. గాజువాక అసెంబ్లీకి పోటీ చేయిస్తామని చెప్పారు.
కాగా, తెలుగు సినిమా పరిశ్రమ రాజకీయాల్లో ముఖ్యమైన భూమికను పోషిస్తూ వస్తోంది. రాజకీయ నాయకులు వివిధ పార్టీల్లో చేరి, తమ వంతుగా ఆ పార్టీలను గెలిపించడానికి కృషి చేస్తున్నారు. మరికొంత మంది పోటీకి దిగారు. మురళీమోహన్, రోజా వంటివారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీనే స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమైన నేతగా మారిపోయారు. బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు విషయంలో ఆయన కీలక భూమిక పోషించారు. బిజెపి నేత నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలని ఆయన అన్నారు.
తాజాగా, నటుడు జీవా గురువారం కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకున్నారు. చంద్రబాబు నాయుడిని కలిశారు. కానీ, అది ఫలించినట్లు లేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.