ఇక సిఎంగా నువ్వెందుకు: జగన్ను ఏకిపారేసిన జెపి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన లోక్సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ సోమవారం నిప్పులు చెరిగారు. తన ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా ఆ వివరాలను కాగ్, హైకోర్టులకు అందిస్తామని, వాటి ఆమోదంతోనే అమలు చేస్తామని, ఆ తరువాత వాటిని విమర్శిస్తే మీడియాపై కోర్టు ధిక్కారణ తప్పదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై జెసి తీవ్రంగా స్పందించారు.
అలాగైతే పరిపాలన ఎందుకని ప్రశ్నించారు. ఇక నువ్వెందుకు? జడ్జీలనే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులను చేయవచ్చు కదా? అన్నారు. జగన్ వ్యాఖ్యలు అసంబద్ధం, హాస్యాస్పదమన్నారు. ఇలాంటి పరిపాలన కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదని, మంచి పరిపాలన, దూరదృష్టి, సామర్థ్యం, నిజాయితీ ఉన్న వారు ఎన్నికయ్యే పరిస్థితి ఉండాలన్నారు. అలాగాక తాత్కాలిక తాయిలాలు, దోపిడీ, కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టేవారిని గెలిపిస్తే ఇక దేశం ఏ రీతిన బాగుపడుతుందన్నారు.
రాజకీయ పార్టీలు విడుదల చేస్తున్న మేనిఫెస్టోల అమలు ఆచరణ సాధ్యం కాదన్నారు. ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారని టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలను ప్రశ్నించారు. పరిపాలన భ్రష్టు పట్టేలా, యువత భవిష్యత్తుని ఫణం పెట్టేలా, రెండు రాష్ట్రాల అభివృద్ధికి పురిట్లోనే సంధి కొట్టేలా, ప్రజలను మరింత బిచ్చగాళ్లను చేసేలా మేనిఫెస్టోలు ఉన్నాయని మండిపడ్డారు.
రాష్ట్ర ఆదాయం రూ. 1.27 లక్షల కోట్లు ఉండగా, ఖర్చు రూ. 1.29 లక్షల కోట్లు అని, తెలంగాణ కేవలం రూ. 2 వేల కోట్ల మిగులులో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రూ.7 వేల కోట్ల లోటులో ఉందన్నారు. పిఆర్సి, పెరుగుతున్న లెక్కల ప్రకారమైతే తెలంగాణలోనూ మిగులు ఉండదన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా, నూతనంగా ఏర్పాటు కానున్న తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్థిక పతనానికి దారి వేసేలా పార్టీల మేనిఫెస్టోలు ఉన్నాయన్నారు.