గ్యాంబ్లింగ్ హబ్ సింగపూర్తో పోలికా?: కేసీఆర్పై షబ్బీర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ నాయకులు గురువారం తీవ్రస్థాయిలో మెండిపడ్డారు. కేసీఆర్ ప్రతిసారీ తెలంగాణను సింగపూర్ చేస్తానంటున్నాడని, అంటే గ్యాంబ్లింగ్ హబ్గా మారుస్తారా? అని కాంగ్రెస్ శాసన మండలి పక్ష ఉప నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలోని మకావు, లాస్ వేగాస్ తర్వాత సింగపూర్ మూడో అతిపెద్ద కేసినో గ్యాంబ్లింగ్ హబ్ అన్నారు.
అందుకే తెలంగాణను భారత్లోనే అతిపెద్ద గ్యాంబ్లింగ్ హబ్గా మార్చాలన్నది కేసీఆర్ ఉద్దేశమేమో అని చురకలు అంటించారు. తాగునీటితో సహా సింగపూర్ ప్రతి వస్తువునూ దిగుమతి చేసుకుంటుందంటూ కేసీఆరే చెబుతున్నారని, అంటే తెలంగాణలోనూ తాగునీటిని దిగుమతి చేసుకునే దుస్థితికి తెస్తారా? అని ఎద్దేవా చేశారు. సింగపూర్తో తెలంగాణను ఏ విషయంలోనూ పోల్చలేమని తెలిపారు.
సింగపూర్ వైశాల్యం 716.1 చదరపు కిలోమీటర్లు అయితే, తెలంగాణ వైశాల్యం 1,14,840 చదరపు కిలోమీటర్లు అని వివరించారు. అక్కడ 50 శాతం ఉద్యోగులు విదేశీయులేనేని, మరి తెలంగాణలో 1956 నిబంధనలు అంటూ కేసీఆర్ పేర్కొనడం ఏమిటన్నారు. తక్కువ జనాభా, వైశాల్యం ఉన్నందున సింగపూర్ను అభివృద్ధి చేయడం సులభమని, కానీ నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణను ఎలా చేస్తారని ప్రశ్నించారు.
కేసీఆర్కు సింగపూర్ మానియా పట్టుకుందని, ఆయన సింగపూర్ అంబాసిడర్గా మాట్లాడటాన్ని కట్టిపెట్టాలని, తెలంగాణలో కరెంటు లేక ఎండుతున్న పంటలన కాపాడటంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మెదక్ జిల్లాలో భూములను కబ్జా పెట్టి కోట్లు సంపాదించిన వ్యక్తికి బీజేపీ టికెట్ ఎలా ఇస్తుందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విహెచ్ విమర్శించారు. జగ్గారెడ్డి పేదల భూముల దోచుకున్నాడని, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయని, అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడమేమిటని ప్రశ్నించారు.