కెసిఆర్: మాటల మాంత్రికుడు, తెలంగాణ వ్యూహకర్త
హైదరాబాద్: కెసిఆర్గా ప్రసిద్ధుడైన కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మాటల మాంత్రికుడిగా పేరుంది. అంతేకాకుండా మంచి వ్యూహకర్త కూడా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సర్వ సిద్ధమైంది. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ 29వ రాష్ట్ర ఏర్పాటు ఘనత మాత్రం కెసిఆర్కే దక్కుతుంది.
కెసిఆర్ 1970ల్లో యువజన కాంగ్రెసు నేతగా మెదక్ జిల్లాలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఆ తర్వాత 1983లో కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీ రామారావు ఆ పార్టీని స్థాపించినప్పుడే కెసిఆర్ ఆందులో చేరారు. ఈ విషయమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో అప్పుడప్పుడు ఆయన వాదనకు దిగుతున్నారు. తన వద్దనే కెసిఆర్ పెరిగారని, కెసిఆర్కు తానే గురువును అంటూ చంద్రబాబు పదే పదే చెప్పుకున్నారు. దాన్ని తప్పు పడుతూ చంద్రబాబు కన్నా ముందే తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లు చెబుకున్నారు. తెలుగుదేశం పార్టీలో మదన్మోహన్పై పోటీ చేసి మొదటిసారి ఓడిపోయారు. కాని , ఆ తర్వాత సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి 1985, 1999 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా పనిచేశారు.
మర్రి చెన్నారెడ్డి వంటి ఉద్ధండులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాలు నడిపారు. కెసిఆర్ 2001 ఏప్రిల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ఏర్పాటు చేసి ప్రత్యేక రాష్ట్ర డిమాండుతో ఎన్నికల పోరాటానికి తెర లేపారు. స్వయంపాలన, ఆత్మగౌరవ నినాదాలను ఆయన అందిపుచ్చుకుని ముందుకు సాగారు. ఆయనకు తెలంగాణలో ఎనలేని ఆదరణ లభించింది. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించి, వారిని తన వైపు తిప్పుకోవడంలో ఆయన విజయం సాధించారు.
పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. జూన్ 2వ తేదీన 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడబోతోంది.
తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని కెసిఆర్ ఆ పార్టీ పెద్దలతో లాబీయింగు కూడా నడిపారు. అయితే, ఆయన లాబీయింగ్ జరిపిన సమయంలో కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధపడలేదు. పైగా, తెలంగాణ ఏర్పాటు విషయంలో అన్యాయం జరగందంటూ విలీనానికి నిరాకరిస్తూ, ఒంటరిపోరుకు సిద్ధమయ్యారు. తెరాస అవిర్భవించినప్పటి నుంచి తెరాస ఒంటరిగా పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.