కాంగ్రెస్కు షాక్: జగన్ పార్టీ వైపు కందుల సోదరులు
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కందుల శివానంద రెడ్డి, రాజమోహన్ రెడ్డిలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. జగన్ బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి, కడప పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డి శనివారం కందుల సోదరులతో చర్చలు జరిపారు.
టిడిపి పార్లమెంట్ అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేయాలని రాజమోహన్ రెడ్డి భావించారు. టికెట్ వస్తుందని ఆశించారు. ఇటీవలే సోదరులిద్దరూ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అయితే మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి తనయుడు శ్రీనివాసుల రెడ్డికి టిడిపి టికెట్ కేటాయించింది. దీంతో అసంతృప్తికి గురైన కందుల సోదరులు జగన్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. అలాగే కొందరు పార్టీలో చేరారు. రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, బిసి నేత నారగోని కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు తాటికాయల జయరాం కూడా కాంగ్రెస్కు మద్దతు తెలిపారు.
అలాగే తెలంగాణ ఖజానా ఉద్యోగుల జెఏసి అధ్యక్షుడు జంగయ్య, ఆటో యూనియన్ల నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.