పొత్తు పేరుతో వెంకయ్య, చంద్రబాబు కుట్ర: కెసిఆర్
సంగారెడ్డి: హైదరాబాద్ శివార్లలో భూదాన భూములను కబ్జా చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును, బిజెపి జాతీయ నేత వెంకయ్య నాయుడు అల్లుడిని ముక్కుపిండి జైల్లోకి తోస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హెచ్చరించారు. తమకు ఇబ్బందులు వస్తాయనే వారు తెలంగాణలో తమ పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే పొత్తు పెట్టుకుని వెంకయ్యనాయుడు, చంద్రబాబు తెలంగాణపై భయానక కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తాను పోటీ చేస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ శాసనసభా నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో కెసిఆర్ ప్రసంగించారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాకారమైనా, అది అంత గొప్పగా ఏమీ ఏర్పాటు కావడం లేదని చెప్పారు. బేషరతు తెలంగాణ కోసం తాము పోరాడగా, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షల తెలంగాణను ఇచ్చిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో ఇంకా తెలంగాణకు న్యాయం జరగాల్సే ఉందని, ఈ పరిస్థితుల్లో తమ పార్టీకి అధికారమిస్తేనే బంగారు తెలంగాణను నిర్మించుకోగలమని, అప్పుడుగానీ ఆంధ్రోళ్లతో పంచాయితీ తెగదని అన్నారు.
అలా కాకుండా గుడ్డిగా ఓటేస్తే దెబ్బ తింటారని హితవు పలికారు. ఓటు వేయడమంటే తెలంగాణ తన తల రాత తాను రాసుకోవడమేనన్నారు. పొరపాటున తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా మతోన్మాద బిజెపికి వేసినట్టవుతుందని అన్నారు. రాజకీయ అవినీతిని బొంద పెడితేనే తెలంగాణ బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రులు పొన్నాల, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డిలపై సిబిఐ కేసులు ఎందుకు పెట్టిందో తెలుసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో పావలా ప్రజలకు అందితే బారణా నాయకుల జేబుల్లోకి వెళ్లిందని దుయ్యబట్టారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నేత కెవిపి రామచందర్ రావు సిఫారసుతోనే పొన్నాల లక్ష్మయ్యకు తెలంగాణ పిసిసి పీఠం దక్కిందని, తెలంగాణలోని కాంగ్రెస్ అభ్యర్థులకు కెవిపి డబ్బు పంపిస్తున్నారని, ఆ ధనం దన్నుతో, సెటిలర్ల ఓట్లతో సుమారు నలభై నియోజకవర్గాలను గెలుచుకోవాలని నిస్సిగ్గుగా ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడి నుంచో బతుకుతెరువుకోసం వచ్చి ఈ గడ్డపై బతుకుతూ ఉద్యమపార్టీకి ఓటేయరాదని వారు (సెటిలర్లు) అంత జిద్దు మీద ఉంటే తెలంగాణ వాళ్లేందుకు అలా ఉండరాదని ప్రశ్నించారు.