అప్పులపై అపరాధ రుసుం ప్రమాదం తప్పింది: కెసిఆర్
హైదరాబాద్: ఈ నెలాఖరులోగా రైతుల రుణ మాఫీని అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. ఈ నెలాఖరులోగా తాము నిర్ణయం తీసుకోకపోతే రుణాలపై 12 శాతం అపరాధ రుసుం పడేదని, తమ నిర్ణయంతో ఆ ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు. రుణమాఫీతో 36 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
రుణ మాఫీపై మంత్రి వర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను కెసిఆర్ సోమవారం ఆమోదించారు. మొత్తం తెలంగాణలో 17 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో 4,250 కోట్ల రుణాలను మాఫీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.
లక్ష రూపాయల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకులు రైతుల రుణాలను రెన్యూవల్ చేస్తాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం రైతుల రుణమాఫీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మత్రి వర్గ ఉప సంఘం మంగళవారంనాడు బ్యాంకర్లతో సమావేశం కానుంది.
కోర్టులో తేలిన తర్వాతనే..
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసికి 250 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. దసరా పండుగకు డ్రైవర్లకు, కండక్టర్లకు మూడు వేల రూపాయల అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. 2,3 నెలల్లో ఆర్టీసి విభజన పూర్తవుతుందని ఆయన చెప్పారు. నంబర్ ప్లేట్ల వివాదం కోర్టులో ఉందని, కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. హైదరాబాద్లో ముంబై తరహా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.