టీకి కరెంట్పై ఎదురుదెబ్బ: చంద్రబాబుపై కెసిఆర్ ఫైర్
హైదరాబాద్: ఇప్పటికే తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల పాలుచేసేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విద్యుదుత్పత్తి నిలిపివేసిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆరోపించారు.
కడప జిల్లా ముద్దనూరులోని 210 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్, విజయవాడలోని వీటీపీఎస్ 500 మెగావాట్ల యూనిట్లలో విద్యుత్ నిలిపివేయటం దారుణం, అనైతికమని ఆయన ధ్వజమెత్తారు. ఈ రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిపివేయటం వల్ల తెలంగాణకు రావాల్సిన 710 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయిందన్నారు.
ఓ వైపు తెలుగు ప్రజలంతా ఒక్కటే అంటూనే తెలంగాణ ప్రజలను ఇబ్బందులపాలు చేసే నిర్ణయం తీసుకోవడం ఏమిటని చంద్రబాబుపై కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో కరెంటు కష్టాలను మరింత పెంచాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఆయన కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
విద్యుత్ పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారానికి సోమవారం కేంద్ర విద్యుత్ సాధికార సంస్థ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విద్యుత్ పంపిణీ నిర్థారణ కోసం నీరజ్ మాధుర్ కమిటీకి రెండు రాష్ట్రాల ఇంధన కార్యదర్శులు సోమవారం తమ వాదనలు వినిపించారు. తెలంగాణకు ఎదురవుతున్న విద్యుత్ కొతరను అధిగమించేందుకు కృష్ణపట్నం నుంచి విద్యుత్ పంపిణీ చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తిని ఆమోదించలేమని ఆంధ్రప్రదేశ్ ఇంధన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు.
కృష్ణపట్నం విద్యుత్కేంద్రం ఆంధ్రలో ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో నిర్మితమైన ప్లాంట్లో తమ వాటా ఉన్నందున విద్యుత్ తమకు కేటాయించాలని తెలంగాణ ఇంధన కార్యదర్శి ఎస్కే జోషి వాదించారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదించిన మేరకే విద్యుత్ సరఫరా జరగాలని మాధుర్ కమిటీ చేసిన ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ముసాయిదాను ఆమోదించేది లేదని ఖరాఖండిగా చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య ఏ అంశంపైనా ఏకాభిప్రాయం కుదరక పోవటంతో తిరిగి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
విద్యుత్ కోనుగోలు ఒప్పందాల వ్యవహారంలోనూ తెలంగాణకు ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడిలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఈఆర్సి పరిధిలో లేనివాటితో తమకు సంబంధం లేదని ఆంధ్ర చేసిన వాదనతో కేంద్ర విద్యుత్ సాధికార సంస్థ ఏకీభవించటం తెలంగాణకు ఎదురుదెబ్బే. ఆంధ్ర రాష్ట్రం రద్దు చేసిన పిపిఏలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్ధానం పరిధిలో ఉన్నందున, దీనిపై చర్చించే అధికారం మాధుర్ కమిటీకి లేదని ఆంధ్ర వాదించింది. ఆంధ్ర వాదనను పరిగణనలోకి తీసుకున్న మాధుర్ కమిటీ ఈఆర్సి పరిధిలోలేని ఒప్పందాల రద్దుకు ఆమోదం తెలిపినట్టు సమాచారం.