సంస్థలపై కెసిఆర్ దూకుడు: బాబు ప్రభుత్వం గుర్రు
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లులో పదో షెడ్యూల్లో చేర్చిన సంస్థల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దూకుడు ప్రదర్శిస్తుండడం చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి కృష్ణారావు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు కూడా. వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్పు దగ్గరి నుంచి కెసిఆర్ అనుసరిస్తున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహంగానే ఉంది.
ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను 9, 10 షెడ్యూళ్లలో చేర్చారు. 9వ షెడ్యూల్లో ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు మొత్తం 89 సంస్థలను చేర్చగా, 10వ షెడ్యూల్లో శిక్షణా సంస్థలు, అకాడమీలను, ఆ కోవలోకి వచ్చే 107 సంస్థలను చేర్చారు. ఈ సంస్థలను ఉభయ రాష్టార్లు పరస్పర అంగీకారంతో ఏడాదిలోపు ఎవరికి వారు విడిగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటును చట్టంలో పొందుపర్చారు. ఈ సంస్థల అప్పులు, ఆస్తుల విభజన విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు తగు మార్గదర్శకాలను జారీ చేయాలని రాష్ట్ర పునర్విభజన చట్టం చెబుతోంది.
9వ షెడ్యూల్లో ఏపీ సీడ్స్, ఏపీ అగ్రోస్, వేర్హౌసింగ్ కార్పొరేషన్, జెన్కో, ట్రాన్స్కో, సింగరేణి కాలరీస్, డిస్కమ్లు, హౌసింగ్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ, ఏపీటీఎస్, ఏపీఐఐసీ, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ, ఏపీ డెయిరీ తదితర విభాగాలున్నాయి. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు, వాటికి సంబంధించిన ఆస్తుల విభజనపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి షీలాభిడే నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటుచేశారు.
అయితే వివాదం అంతా 10వ షెడ్యూల్లోని సంస్థలపైనే కేంద్రీకృతమైంది. ఈ షెడ్యూల్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ, సుపరిపాలనా కేంద్రం (సీజీజీ), ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీ, ఫారెస్ట్ అకాడమీ, ఎక్సైజ్ అకాడమీ, ప్రెస్ అకాడమీ, తెలుగు, హిందీ, సంస్కృత అకాడమీలు, మహిళా విశ్వవిద్యాలయం, ద్రవిడ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, టెక్ట్స్ బుక్ ప్రెస్, వక్ఫ్ బోర్డు, హజ్ కమిటీ, రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్, ఏపీ స్టడీ సర్కిల్, ఇంటర్ బోర్డు, ఉన్నత విద్యా మండలి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, సెర్ప్, బీసీ కమిషన్, బాపట్ల, హసన్పర్తి, సామర్లకోట, శ్రీకాళహస్తి, రాజేంద్రనగర్ల్లోని వ్యవసాయ శిక్షణా కేంద్రాలు వంటివి ఉన్నాయి.
ఈ షెడ్యూల్లోని సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన. కొద్ది రోజుల కిందట జాతీయ టూరిజం, హాస్పటాలిటీ మేనేజ్మెంట్ సంస్థ (నిథమ్)కు వెళ్లిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి చందనాఖన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నాక్) చైర్మన్గా బాధ్యతలు స్వీకరించటానికి వెళ్లిన శ్యాంబాబులకు చేదు అనుభవాలు ఎదురైన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయ్యారు.
చట్టంలోని నిబంధనల మేరకే తాము తెలంగాణ సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ఆ సందర్భంగా గవర్నర్కు స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాలను నేరుగా తెలంగాణకు అన్వయించుకోవటానికి అవకాశం ఉందని, అలాగే 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు, అకాడమీలను తెలంగాణ ప్రభుత్వం కూడా సొంతంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నందున చట్టం మేరకే తాము వ్యవహరిస్తున్నామని ఆయన వివరించారు. ఇదే వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగానే ఎపి సిఎస్ గవర్నర్కు లేఖ రాశారు.