కాంగ్రెస్, టిడిపికి అధికారమిస్తే అంతే: కెసిఆర్(పిక్చర్స్)
మహబూబ్నగర్: ప్రస్తుతం ఆంక్షలతో కూడిన తెలంగాణ వచ్చిందని, అనుకున్న తెలంగాణ రావాలంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సారి జరిగే ఎన్నికలను ఓటర్లు సులభంగా తీసుకోరాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మొదటిసారి వచ్చిన ఎన్నికలని, ఈ ఎన్నికలే తెలంగాణ ప్రజల కోటి ఆశలను నెరవేర్చనున్నాయని అన్నారు.
కాంగ్రెస్ నేతలు తామే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అంటున్నారని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రబాబు అయినా ఇక్కడే దుకాణం పెడతానంటున్నారని అన్నారు. ఆంధ్రజెండాలు తెలంగాణలో ఉండటానికి ఆస్కారమే లేదని, ఇప్పటికే 60ఏళ్లు గోస అనుభవించామని చెప్పారు. తెలంగాణ కోసం తాను నిరాహార దీక్ష చేసి చావు అంచులోకి పోతే రాష్ట్రాన్ని ప్రకటించి తిరిగి తీసుకున్నారని, సకలజనులు సమ్మె చేస్తే విధిలేక దిగివచ్చి రాష్ట్రాన్ని ప్రకటించారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని చివరి నిమిషం దాకా అడ్డుకున్నది చంద్రబాబు, బిజెపి నేత వెంకయ్య నాయుడేనని అన్నారు. తెలంగాణకే తలమానికమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని చట్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం విక్రయించిందని, టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే చంద్రబాబుకు శ్రీకృష్ణజన్మస్థానం తప్పదని ఆయన హెచ్చరించారు. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేసి 14లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు.
కాంగ్రెస్కు అధికారం ఇస్తే ప్రజలకు పావలా ఇచ్చి జేబులో ముప్పావలా పెట్టుకుంటారని విమర్శించారు. అవినీతికి పాల్పడితే స్వంత కొడుకునైనా జైలుకు పంపుతానని అన్నారు. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, పాలమూరు జిల్లాలోని వనపర్తి, నాగర్కర్నూల్లను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సాధిస్తామని, ఆర్డీఎస్ ద్వారా 15.9 టిఎంసీల సాగునీరును అందిస్తామని, ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని, ప్రతి గిరిజన తాండాను పంచాయితీలుగా ఏర్పాటు చేస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు.
కెసిఆర్ ప్రసంగం
ప్రస్తుతం ఆంక్షలతో కూడిన తెలంగాణ వచ్చిందని, అనుకున్న తెలంగాణ రావాలంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు అన్నారు.
భారీగా హాజరైన జనం
బుధవారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
కోటి ఆశలు
ఈ సారి జరిగే ఎన్నికలను ఓటర్లు సులభంగా తీసుకోరాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మొదటిసారి వచ్చిన ఎన్నికలని, ఈ ఎన్నికలే తెలంగాణ ప్రజల కోటి ఆశలను నెరవేర్చనున్నాయని కెసిఆర్ అన్నారు. టిఆర్ఎస్ను గెలిపిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు.
అవినీతికి పాల్పడితే జైలుకే..
కాంగ్రెస్కు అధికారం ఇస్తే ప్రజలకు పావలా ఇచ్చి.. జేబులో ముప్పావలా పెట్టుకుంటారని కెసిఆర్ విమర్శించారు. అవినీతికి పాల్పడితే స్వంత కొడుకునైనా, కూతురునైనా జైలుకు పంపుతానని అన్నారు.