చివరి నిమిషం దాకా: మోడీ, బాబులను ఏకేసిన కెసిఆర్
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన నిప్పులు చెరిగారు. నిజామాబాద్ సభలో ఆయన ప్రసంగించారు. మోడీ నరనరాన తెలంగాణ వ్యతిరేకత ఉందన్నారు.
తెలంగాణ వ్యతిరేకి మోడీ సరసన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేరారన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్ముకుంది చంద్రబాబే అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సింగూరు జలాలను నిజామాబాద్ తీసుకు వస్తామని చెప్పారు.
తెలంగాణలో టిడిపికి ఒక్క సీటు కూడా రాదన్నారు. బిజెపికి వేసే ప్రతి ఓటు చంద్రబాబుకు, టిడిపికే పోతుందన్నారు. గాడిదకు మేత వేసి ఆవుకు పాలు పిండితే రావన్నారు. తెరాస అంటే తెలంగాణ ఇంటి పార్టీ అని, ఈ ఎన్నికలు తెలంగాణకు చాలా కీలకమైనవని చెప్పారు. ఓటు వేసే సమయంలో పొరపాటు చేయవద్దన్నారు. తెలంగాణ తన రాతను తానే రాసుకోబోతుందన్నారు.
ఎవరి చేతిలో తెలంగాణ రక్షణగా ఉంటుందో తెలుసుకోవాలన్నారు. మోడీ తెలంగాణ దుష్మణ్ అన్నారు. ఉద్యమాన్ని ఎంత నిబద్ధతగా నడిపించామో.. ప్రభుత్వాన్ని అలాగే నడుపుతామన్నారు. మోడీ నరనరాన తెలంగాణ వ్యతిరేకత ఉందన్నారు. చిట్ట చివరి నిమిషం వరకు తెలంగాణ వ్యతిరేకిగానే ఉన్నారన్నారు. తెలంగాణపై మోడీ అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు.