పవర్ సమస్య పరిష్కారం: త్వరలో చత్తీస్గఢ్కు కెసిఆర్
హైదరాబాద్: శాసనసభ సమావేశాలకు ముందే తెలంగాణలో విద్యుచ్ఛక్తి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆయన ఛత్తీస్గఢ్ నుంచి విద్యుచ్ఛక్తిని కొనుగోలు చేసేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.
పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ సర్కారుతో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవటానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు త్వరలో ఆ రాష్ట్రానికి వెళ్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావటానికి ముందే ఆయన ఛత్తీస్గఢ్ పర్యటన ఉంటుందని ఆ వర్గాలు చెప్పాయి.
రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉండటం, విపక్షాలు ఇదే సమస్యపై ప్రభుత్వాన్ని పదేపదే నిలదీస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం పెద్దలు విద్యుత్ సమకూర్చుకోవటంపై దృష్టి సారించారు. ఈ మేరకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులు ఫలించాయని, రాషా్ట్రనికి ఏడాదిపాటు వెయ్యి మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయటానికి అక్కడి ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెబుతున్నారు.
దీంతో, ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవటానికి స్వయంగా సీఎం కేసీఆర్ వెళ్లిరావాలని నిర్ణయించినట్లు తెలిసింది. నవంబర్ 5వ తేదీనుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతుండగా, ఈ నెల 31న ఆయన ఛత్తీస్గఢ్ వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
విద్యుత్తు కొరతపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదం చోటు చేసుకుంది. సమస్యను తగ్గించడానికి శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉత్పత్తిని నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.