'మోడీ'తో కుట్ర: కెసిఆర్, ఈటెల కారుపై గ్రామస్థుల దాడి
కరీంనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పేరు ఉంటే వాటితో సీట్లు గెలుచుకొని తెలంగాణ రాష్ట్ర సమితిని అధికారంలోకి రాకుండా చేసే పెద్ద కుట్రను టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు చేస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.
కరీంనగర్ జిల్లా హుస్నాబాదులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటులో తెరాస పాత్ర లేదని ఏఐసిసి అధ్యక్షురాలే స్వయంగా చెప్పారని, అది నిజమేనని, తమ పాత్ర ఉండి ఉంటే మనం అనుకున్న తెలంగాణ వచ్చేదన్నారు.
పార్లమెంటు, అసెంబ్లీకి తెరాస అభ్యర్థులను గెలిపిస్తే తెరాస పోట్లాడి తెలంగాణను అభివృద్ధి చేస్తుందన్నారు. తెలంగాణ వచ్చిందని, కెసిఆర్ బతికున్నాడు కాబట్టి అభివృద్ధి జరగాలన్నారు. ఉద్యమం నడిపినప్పుడు పగ్గాలు తన చేతిలో ఉండేవని, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు పగ్గాలు మీ చేతుల్లో ఉన్నాయని ప్రజలను ఉద్దేశించి అన్నారు.
తెలంగాణ తెచ్చి మీకు అప్పజెబుతానని లేదంటే రాళ్లతో కొట్టి చంపండన్నానని, అలాగే మీకు తెచ్చి ఇచ్చానన్నారు. చంద్రబాబు ఆంధ్రాబాబు అని, మనకు చెందిన వాడు కాదన్నారు. కొంతమంది సన్నాసులు ఇంకా టిడిపి జెండా మోస్తున్నారని మండిపడ్డారు. టిడిపిలో టి నేతలు ఉండటంపై ఓ పిట్టకథను చెప్పి ఆకట్టుకున్నారు.
బిజెపి, టిడిపి పొత్తు మతలబేంటో చెప్పాలన్నారు. బాబు, వెంకయ్య కుట్ర దాగి ఉందని, పెద్ద ప్రమాదం ఉందన్నారు. తెరాసను అధికారంలోకి రాకుండా చేయాలని చూస్తున్నారన్నారు. సగం సగం అధికారం ఇస్తే తాను ఏం చేయలేనని, పూర్తి అధికారం ఇవ్వాలన్నారు.
ఈటెల వాహనంపై దాడి
కరీంనగర్ జిల్లా వీణవంగ మండలం నర్సింగాపురం గ్రామంలో తెరాస నేత ఈటెల రాజేందర్ ఇన్నోవా వాహనం పైన గ్రామస్తులు దాడి చేశారు. తెరాస మాజీ కార్యకర్త బాలరాజు హత్యకు ఈటెల వర్గీయులే కారణమని గ్రామస్థులు ఆయన వాహనంపై దాడి చేశారని సమాచారం. 2006లో తెరాస ఎంపిటిసిగా గెలిచిన బాలరాజు ఈటెల వర్గీయులతో విభేదాలతో రాజీనామా చేశారు. ఆ తర్వాత హత్యకు గురయ్యరు. దీనికి ఈటెల వర్గీయులే కారణని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దాడి చేశారు. కారు అద్దాలు పగిలాయి.