సర్వే: కెసిఆర్ కుటుంబం నమోదు, చిరు వివరాలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా తన కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్లకు తెలిపారు. కెసిఆర్ కుటుంబ సభ్యుల వివరాలను ఎన్యుమరేటర్లు ఆయన అధికారిక నివాసంలో సేకరించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి సెంట్రల్ జోన్ కమిషనర్ సత్యనారాయణ కెసిఆర్ వద్దకు వచ్చారు. అలాగే, జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ కూడా వచ్చి సర్వేపై వివరాలను చెప్పారు. తన కుమారుడు కెటి రామారావు, ఇతర కటుంబ సభ్యుల వివరాలను కెసిఆర్ వివరించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర ఆస్తుల వివరాలను కూడా ఆయన చెప్పారు.
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నేత మెగాస్టార్ చిరంజీవి కూడా తన కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్లకు అందించారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు తన కుటుంబం వివరాలను వెల్లడించారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాము ఎవరికీ భయపడబోమని ఆయన అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సర్వేకు మంచి స్పందన లభిస్తోందని, ఎన్యుమరేటర్లకు చాయ్, టిఫిన్లు ఇచ్చి ప్రజలు సర్వేను ఆహ్వానిస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పండుగ వాతావరణం ఏర్పడిందని ఆయన అన్నారు. సర్వేతో ప్రజలకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడిందని చెప్పారు. తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేది లేదని ఆయన అన్నారు.
సీమాంధ్ర ప్రభుత్వాలు కరువు బారిన పడిన రైతులకు ఏనాడైనా సహకారం అందించిందా అని ఆయన అడిగారు. దళితులకు భూమి పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన అన్నారు. తమది చేతల ప్రభుత్వమని ఆయన అన్నారు. తమను విమర్శిస్తున్నవాళ్లు ప్రజల్లో ఆభాసుపాలు అవుతున్నారని ఆయన అన్నారు. సర్వే వివరాలను త్వరలో డేటాబేస్లో నమోదు చేయనున్నట్లు హరీష్ రావు చెప్పారు.