అరుదైన కాన్క: ఎటు వైపు నుంచి చూసినా కెసిఆరే
సింగపూర్: సింగపూర్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు అరుదైన బహుమతి లభించింది. కొందరు ఔత్సాహికులు తన బొమ్మతో ఉన్న హాలోగ్రాఫిక్స్ ఫ్రేంను ఆయనకు బహూకరించారు. ఎటువైపు నుంచి చూసినా కెసిఆర్ కనిపించడం ఈ ఫ్రేం ప్రత్యేకత.
బ్రాండ్ తెలంగాణ పేరుతో సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏర్పాటైన బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్నారు. సీఐఐ, తెలంగాణ ప్రభుత్వం, సింగపూర్ హైకమిషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ సమ్మిట్లో కెసిఆర్ బొమ్మతో ఉన్న హాలో గ్రాఫిక్స్ ఫ్రేం ఆకర్షణగా నిలిచింది.
సింగపూర్ పెట్టుబడిదారులకు కెసిఆర్ పూర్తి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కొత్త ఏర్పడిన రాష్ట్రాభివృద్ధి కోసం అవినీతిరహితమైన వాతావరణంలో ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని కెసిఆర్ హామీ ఇచ్చారు. పూర్తిస్థాయి రక్షణ, భద్రతా ఏర్పాట్లతో అవినీతిరహిత రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని ఆయన చెప్పారు.
తెలంగాణలో ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టడానికి విస్తృతమైన అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో మొబైల్ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పెట్టుబడిదారుల ప్రతిపాదనలకు ఆలస్యం లేకుండా ప్రభుత్వాధికారులు, మంత్రులు ఆమోదం తెలిపే విధంగా యంత్రాంగాన్ని తయారు చేస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు.
పరిశ్రమలకు పూర్తి స్థాయి విద్యుత్తును అందించే విధంగా రానున్న ఆరు ఏళ్లలో 8 వెల మెగావాట్ల విద్యుదుత్పత్తికి ప్రభుత్వం ప్రాజెక్టులను రూపొందిస్తోందని, అందుకు తగిన కృషి చేస్తోందని కెసిఆర్ చెప్పారు.