ఎమ్మెల్సీ: క్రిస్టియన్లకు కేసీఆర్ హామీ, టీని చూసి దేశం..
హైదరాబాద్: క్రిస్టియన్ మతపెద్దలు సూచించిన వారికే ఎమ్మెల్సీ సీటును ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా క్రిస్టియన్లకు ఎమ్మెల్సీ సీటును కేటాయిస్తామని చెప్పారు. తెలంగాణలో లౌకిక స్ఫూర్తిని నెలకొల్పుతామని, ఇతర రాష్ట్రాలు తెలంగాణను చూసి ఆదర్శంగా నిలిచేలా చేస్తామన్నారు.
రంజాన్ మాసం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చినట్లే, క్రిస్టియన్లకు క్రిస్మస్ సమయంలో ప్రత్యేక కార్యక్రమం ఉంటుందన్నారు. క్రిస్టియన్లకు రిజర్వేషన్ల శాతం పెంచే ప్రయత్నాలు చేస్తామన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యానికి విఘాతం కలిగిందని, ఇప్పుడు ఆలాంటివి ఉండవన్నారు.
క్రైస్తవులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని క్రైస్తవులకు కేటాయిస్తామన్నారు. చర్చిల నిర్మాణానికి కలెక్టర్ల అనుమతి లేకుండా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని, మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నామన్నారు.
చట్టసభల్లో క్రిస్టియన్లకు ప్రాతినిథ్యం విషయమై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. వారి సమస్యలు సభల్లో చెప్పుకునే అవకాశం ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకోవాలన్నారు. ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో క్రిస్టియన్ స్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామన్నారు. క్రిస్టియన్ రిజర్వేషన్ల విషయంలో పూర్తిస్థాయిలో అధ్యనయం చేస్తామన్నారు. నిజాం కాలంలో తెలంగాణలో మతసామరస్యం వెల్లువిరిసిందన్నారు.