పారిశ్రామిక పాలసీ, ఇరిగేషన్పై కెసిఆర్ రివ్యూ(పిక్చర్స్)
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని మోతె గ్రామంలో పసుపు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో మోతె గ్రామస్తులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సూచించారు. కేంద్ర స్పైసెస్ బోర్డ్ సహకారంతో తెలంగాణలో సమగ్ర పసుపు అభివృద్ధి పథకాన్ని తీసుకురానున్నట్లు కెసిఆర్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయ పద్ధతులపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మంత్రి హరీశ్ రావు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకాపూర్ గ్రామంలో రైతుల వ్యవసాయ పద్ధతులను, గుత్ప ఎత్తిపోతల పథకం విస్తరణ పనులను పరిశీలించేందుకు త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తానని కెసిఆర్ తెలిపారు.
అంకాపూర్ గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందని, అక్కడి రైతులకు ప్రభుత్వం చేయూతనిచ్చి, ఆధునిక వ్యవసాయ పనిముట్లు అందిస్తే దేశంలోనే ఆదర్శంగా నిలుస్తారని కెసిఆర్ అన్నారు. జిల్లాలోని గుత్ప, పోచారం ప్రాజెక్టులను విస్తరిస్తే జిల్లాలోని జాక్రాన్పల్లి, వేల్పూర్ మండలాలకు అదనంగా నీరందించవచ్చునని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రాజెక్టుల విస్తరణ పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని నిర్దేశించారు.
నిజమాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండేలా కొత్త భవనాలు నిర్మించాలని సిఎం ఆదేశించారు. ఈ సమావేశంలో నీటిపాదరుల శాఖ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావులు పాల్గొన్నారు. అంతకుముందు పారిశ్రామ విధానంపై అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు.