కెసిఆర్ ఫ్లెక్సీ దహనం: ఆందోళన, ఉద్రిక్తం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చిత్రం ఉన్న ఫ్లెక్లీ కాలిపోయింది. హైదరాబాదులోని బంజారాహిల్స్లో గల తెరాస కార్యాలయంలో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులు చేరుకునే లోగానే ఫ్లెక్సీ కాలిపోయింది. తెరాల కార్యాలయం వద్ద అగ్ని ప్రమాదం జరిగిందంటూ ప్రచారం కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద యెత్తున అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు
తెరాస కార్యాలయం సమీపంలోని దాదాపు 30 అడుగుల ఎత్తు ఉన్న ఫ్లెక్సీ కాలుతోందని సమాచారం ఇవ్వడంతో తాము వెంటనే వచ్చామని హైదరాబాద్ పశ్చిమ మండలం డిసిపి వి. సత్యనారాయణ చెప్పారు. రాత్రి పదిగంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు గుర్తించామని, ఫ్లెక్సీ కాలిన తీరు ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టి ఉంటారనే అనుమానాలున్నాయని ఆయన అన్నారు. తెరాస కార్యాలయం బాధ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కాలిన కెసిఆర్ ఫ్లెక్సీ
తెరాస కార్యాలయం సమీపంలోని దాదాపు 30 అడుగుల ఎత్తు గల కెసిఆర్ చిత్రం ఉన్న ఫ్లెక్సీ బుధవారం రాత్రి కాలిపోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సిసి కెమెరాను పరిశీలిస్తాం..
ఘటన జరిగిన చోటుకి దగ్గరలో ఓ సిసి కెమెరా ఉదని, ఆ కెమెరా దృశ్యాలను చూసిన తర్వాత ఎవరైనా కావాలని చేశారా, ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయంపై నిర్ధారణకు వస్తామని డిసిపి సత్యనారాయణ చెప్పారు.
ఫ్లెక్సీలో వీరి ఫొటోలు కూడా..
కెసిఆర్ చిత్రంతో పాటు ఫ్లెక్సీలో తెలంగాణ మంత్రి కెటిఆర్, స్థానిక నాయకుడు గోవర్ధన్ రెడ్డి చిత్రాలు కూడా ఉన్నాయి. వీరిపై కక్ష గట్టినవారు ఎవరైనా ఈ దురాగతానికి పాల్పడి ఉండవచ్చునని తెరాస శ్రేణులు అనుమానిస్తున్నాయి.
సిసి కెమెరా పనిచేయడం లేదు...
సంఘటనా స్థలంలో ఉన్న సిసి కెమెరా పనిచేయడం లేదు. సిఎం కెసిఆర్ ఫ్లెక్సీని దురుద్దేశపూర్వకంగానే కాల్చేశారంటూ తెరాస కార్యకర్తలు నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.
అర్థరాత్రి దాటిన తర్వాత కూడా..
ఫ్లెక్సీ దగ్ధంపై ఆగ్రహం చెందిన కార్యకర్తలు బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ఆందోళన కొనసాగించారు.
ఉన్నతాధికారుల ఆరా...
ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై తెలంగాణ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. కావాలని ఎవరైనా చేసి ఉంటారా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు.
రోడ్డుపై బైఠాయించి...
కెసిఆర్ ఫ్లెక్సీని కావాలనే దగ్ధం చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు.