కెసిఆర్పై శ్రవణ్ సంచలనం, హైద్రాబాద్ పైనా: హరీష్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెసు పార్టీ నేత శ్రవణ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. కెసిఆర్ అబద్దాల పునాదుల పైన సిఎం కావాలనుకుంటున్నారని విమర్శించారు. 52 అసెంబ్లీ, 10 లోకసభ స్థానాలను కెసిఆర్ అమ్ముకున్నారని ఆరోపించారు. హైదరాబాదును పదేళ్ల ఉమ్మడి రాజధానికి ఒప్పుకున్న కెసిఆర్... ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు రాత్రికి రాత్రి గులాబీ కండువా కప్పుకుని నోట్ల సంచులు పట్టుకొచ్చిన వాళ్లకు కెసిఆర్ టిక్కెట్లు ఇచ్చారని ఇచ్చారన్నారు. ఈ విధంగా చేయడం కెసిఆర్ది నీతివంతమైన రాజకీయమా అన్నారు.
తెలంగాణకు 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 52 స్థానాలు అమ్ముకోవటం, 17 ఎంపీ స్థానాలు ఉంటే అందులో 60 శాతం సీట్లు అమ్ముకోవడం అనేది భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత నీచంగా పాల్పడి ఉండదన్నారు. సీట్లు అమ్ముకునే కెసిఆర్ అవినీతి నిర్మూలన చేస్తామని నీతివంతమైన వ్యాఖ్యలు చేస్తుంటే ప్రజలు ఎట్లా నమ్ముతారన్నారు.
అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే, కన్నకోడుకైనా సరే జైలుకు పంపిస్తామని కెసిఆర్ చెబుతున్నారని, మరి సీట్లు అమ్ముకున్న కెసిఆర్ను చెర్లపల్లి జైలుకు పంపాలా, చంచల్గూడా జైలుకు పంపాలా లేక ఎవరికీ అందుబాటులో లేకుండా అండమాన్ జైల్కు పంపాలా అని ప్రశ్నించారు. వైయస్, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడ్డారని, కానీ తెరాస పార్టీ నాయకత్వం మాత్రం ఏ అధికారంలోకి రాక ముందే ఇంత విచ్చలవిడిగా రాజకీయ అవినీతికి పాల్పడ్డ చరిత్ర కెసిఆర్ది అన్నారు.
కాంగ్రెస్పై హరీష్ రావు ఫైర్
కాంగ్రెస్ నాయకులు కెసిఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, కెసిఆర్ను తిట్టినంత మాత్రాన కాంగ్రెస్కు ఓట్లు రాలవని తెరాస నేత హరీష్ రావు అన్నారు. తెలంగాణలో వందలాది మంది బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని, జైరాం రమేష్కు తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఏనాడైనా ఆయన అమరవీరుల కుటుంబాలను కాని, ఉద్యమకారులను కానీ పరామర్శించారా అన్నారు. ఉద్యమకారులను జైల్లో పెట్టించిన ఘనత పొన్నాలది అన్నారు.
కాంగ్రెసు పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. ముఖ్యమంత్రులు అవుదామనుకుంటున్న తెలంగాణ కాంగ్రెసు నేతలు ఎందరు గెలుస్తారో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఒక్క ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలవలేదన్నారు. నిజామాబాదు జిల్లాలో పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ కూడా చిత్తుగా ఓడిపోయారన్నారు.