బాబుని జైలుకు పంపిస్తా, జనార్ధన్ భయానికైనా: కెసిఆర్
మహబూబ్ నగర్: రానున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం తెరాస అధికారంలోకి వస్తే టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమాలను తవ్వి జైలుకు పంపిస్తామని ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు సభలో ఆయన మాట్లాడారు. పాలమూరుకు నీళ్లొస్తే బంగారం పండుతుందన్నారు. పాలమూరుకు నీరు రావాలంటే తెరాసను గెలిపించాలన్నారు.
పాలమూరు నుంచి అందరూ వలసలు వెళ్లడాన్ని ఆపేస్తామని, వేరే జిల్లాల నుంచి పాలమూరుకు వలసలకు వచ్చేలా చేస్తామని ఆయన తెలిపారు. వేలకోట్లు, లక్షల కోట్లు అవినీతి చేసిన కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ అవినీతి అంతమైతేనే అభివృద్ధి సాధ్యమన్నారు. మనం కోరుకున్న తెలంగాణ రాలేదన్నారు. ఆంక్షలతో కూడుకున్న తెలంగాణ పోవాలంటే తెరాస అధికారంలోకి రావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కలిసిన పాపానికి అరవయ్యేళ్లు కష్టపడ్డామన్నారు. మనం అనుకున్న తెలంగాణ నిర్మాణం తెరాసతోనే సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ప్రత్యేక సందర్భంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దన్నారు. కాంగ్రెసు పార్టీకి ఓటేసి ప్రజలు మోసపోవద్దన్నారు. చంద్రబాబు ఇన్నాళ్లు కోర్టుల ముసుగులో దాగిపోయారని మండిపడ్డారు.
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని అమ్మిన చంద్రబాబును శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తామన్నారు. రాజకీయ అవినీతికి పాల్పడిన వాడు కొడుకైనా, కూతురైనా జైలుకే అన్నారు. తాము తమ మేనిఫెస్టోలోని అన్ని హామీలను అమలుపరుస్తామన్నారు. బిజెపికి ఓటేస్తే టిడిపికి వేసినట్లే అన్నారు. తెలంగాణ మంత్రులు ఆంధ్రా నేతలకు అమ్ముడుపోయారని మండిపడ్డారు. జనార్ధన్ భయానికైనా నాగర్ కర్నూలును జిల్లాగా చేస్తానని చమత్కరించారు.
మహబూబ్ నగర్ జిల్లాను మూడు జిల్లాలుగా చేస్తామని, వనపర్తిని ఓ జిల్లాగా చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. ఆరునూరైనా తెలంగాణ ప్రాంతం పచ్చబడాలన్నారు. పాలమూరు నుండి ముంబైకి వలసలు ఆగిపోవాలన్నారు. పాలమూరు పచ్చబడాలన్నారు. పాలమూరులో వరి కోసేందుకు ఇతర ప్రాంతాల నుండి కూలీలు రావాలన్నారు.