దెయ్యాల చేతుల్లో పెట్టను: కాంగ్రెసుపై కెసిఆర్ ఫైర్
గజ్వేల్: ఎందరో దేవుళ్ల వరప్రసాదంగా పుట్టిన బిడ్డను దెయ్యాలపాలు చేసిన తల్లిపాత్రను తాను పోషించలేనని, 13 ఏళ్లు పోరాటం, 1500 మంది అమరుల త్యాగఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులకు అప్పగించబోనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని తన ఫాంహౌస్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించి తెలంగాణలో సొంతంగా తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. దెయ్యాల వంటి కాంగ్రెస్ నాయకులతో తెలంగాణ అభివృద్ధి సాధ్యంకాదన్నారు. తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వ్యవసాయ, పారిశ్రామిక, నీటిపారుదల రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని హామీ ఇచ్చారు.
ప్రాణహిత- చేవెళ్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేసి తెలంగాణలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. తాను పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తానని, వర్గల్ మండలం పాములపర్తి- మర్కుక్ గ్రామాల మధ్య గల చెరువును 21 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
హెచ్ఎండీఏ పరిధిలోని వర్గల్, ములుగు, తూప్రాన్ మండలాల రైతులకు ప్రాణహిత-చేవెళ్ల సాగునీటి పథకం వర్తింపజేస్తానని హామీ ఇచ్చారు. గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తన గెలుపు ఎప్పుడో ఖాయమైందని, మెజారిటీ పెంచుకోవడమే ముఖ్యమని అన్నారు. తాను గజ్వేల్ నుంచి గెలిస్తే ముఖ్యమంత్రిని అవుతానని, ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మార్చివేస్తానని ఆయన అన్నారు.