గెలవలేకే, తొక్కేస్తాం: బాబు, పిచ్చి కూతలొద్దు: కెసిఆర్
ఖమ్మం/వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు గెలుపుపై నమ్మకం లేకనే రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్నారని టిడిపి అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం మండిపడ్డారు. ఆయన ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సైకిల్కు ఎదురొస్తే తొక్కేస్తామన్నారు. టిడిపిని గెలిపిస్తే ప్రజలకు సుస్థిరమైన రాముని పాలన అందిస్తామని, తమను గెలిపిస్తే నెంబర్ వన్ కూలీగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తామన్నారు.
తమకు, నందమూరి కుటుంబానికి భద్రాచలంతో విడదీయరాని బంధం ఉందన్నారు. అందుకే ఎన్నికల్లో గెలవగానే ఎన్టీఆర్ ఆరోగ్య పథకం ప్రవేశపెట్టనున్నామని, ప్రజలందరికీ ఇది మేలుచేస్తుందని చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ పాలకులు అవినీతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల తమ ప్రభుత్వ హయాంలో ప్రపంచ పటంలో రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేశామని, తరువాత వచ్చిన కాంగ్రెస్ పాలకులు అవినీతిలో ప్రపంచ రికార్డు సృష్టించారని ధ్వజమెత్తారు.
వైయస్ ఆత్మగా చెప్పుకునే కెవిపి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు తీశారన్నారు. ఇక దోపిడీదారులతో కలిసి పార్టీ పెట్టిన జగన్ విశ్వసనీయత గురించి మాట్లాడడం ఆశ్చర్యకరమన్నారు. ఖమ్మం జిల్లా బయ్యారంలోని 1.44 లక్షల ఎకరాల్లో ఖనిజ సంపదను దోచుకునేందుకు ప్రయత్నిస్తే ప్రజలందరితో కలిసి అడ్డుకున్నామని చెప్పారు. ఆ పార్టీ గెలిస్తే దేశాన్నే దోచుకుంటారని, చెప్పేది చేయకుండా ప్రజల ఆవేశాన్ని తనకు అనుకూలంగా మాలచుకునేందుకు కెసిఆర్ అబద్ధపు ప్రచారాలు చేస్తుండాన్నారు.
కుటుంబంలోని అందరికీ పదవులు ఇప్పించడం తప్ప ఆయన ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడే కెసిఆర్ తన మాటతీరును మార్చుకోవాలననారు. కెసిఆర్ హుందాతనాన్ని అలవర్చుకుంటే మంచిదన్నారు. ఆయన మాటలకు బెదిరిపోయేది లేదని, దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. ఖబడ్దార్ కెసిఆర్ అంటూ హెచ్చరించారు. రాథోడ్ రమేష్ను మరోసారి ఎంపీగా గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవిని కట్టబెడుతామన్నారు.
బాబుపై కెసిఆర్
చంద్రబాబు పిచ్చికూతలు కూయవద్దని కెసిఆర్ హెచ్చరించారు. బాబు సోయి తప్పి మాట్లాడుతున్నారని, తాను తల్చుకుంటే ఇంట్లోంచి బయట అడుగు పెట్టగలవా అని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక జైలుకు పంపిస్తామన్నారు. కెసిఆర్ నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పర్యటించారు. చంద్రబాబు జిత్తులమారి నక్క అని, ఆయనను మించి రంగులు మార్చేవారు ప్రపంచంలో ఎక్కడా ఉండరన్నారు.
తెలుగుగంగలో ఆంధ్ర ప్రాంతానికి ఉన్నది కేవలం 19 టిఎంసిలేనని ఇప్పుడు వారు తీసుకెళ్తున్నది 335 టిఎంసిలన్నారు. సమైక్యాంధ్ర ప్రదేశ్గా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని, తెలంగాణ ఏర్పడితే నీరు తీసుకుపోనిస్తారా అని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి రఘువీరా రెడ్డి అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు, మంత్రులు దద్దమ్మలని ఆంధ్రమంత్రులు నీళ్లు తీసుకుపోతున్నా కళ్లు మూసుకుని కూర్చున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ సాధించిన కీర్తి నాకు వెయ్యి జన్మలకు తృప్తి అన్నారు. తాను తెలంగాణ ఏర్పాటయ్యాక రాజకీయాల్లోకి రావద్దనుకున్నాను. కాని ఎంతోమంది మిత్రులు, ఉద్యోగులు వచ్చి దద్దమ్మలకు, సన్నాసులకు తెలంగాణ అప్పగించవద్దని చెప్పడంతో మనస్సు మార్చుకుని తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఎన్నికల్లో పోటీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. మీ జీవితంలో చూడని అభివృద్ధిని తెలంగాణలో చేసి చూపిస్తామన్నారు.