కెసిఆర్ వర్సెస్ కోదండరామ్: ఇక బహిరంగ సమరమే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్కు మధ్య విభేదాలు పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ జెఎసిని దెబ్బ తీయాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారనే ఉద్దేశంతో కోదండరామ్ కెసిఆర్తో జరుగుతున్న ప్రచ్ఛన్న పోరాటాన్ని బహిరంగ సమరంగా మార్చే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ వికాస సమితి ఏర్పాటు తెలంగాణ జెఎసిని దెబ్బ తీయడానికేనని కోదండరామ్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆదివారంనాడు కెసిఆర్కు అత్యంత సన్నిహితులైనవారి ఆధ్వర్యంలో తెలంగాణ వికాస సమితి (టివిఎస్) ఏర్పడింది. కెసిఆర్ ఓఎస్డిగా నియమితులైన దేశపతి శ్రీనివాస్ టివిఎస్కు నాయకత్వం వహించడం ఆ అభిప్రాయాన్ని బలపరుస్తోందని అంటున్నారు.
తెలంగాణ జెఎసిని రద్దు చేయాలని ఓ వర్గం రాజకీయ నాయకుల నుంచి డిమాండ్ వస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ జెఎసిని చీల్చాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ సంస్థ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధితో అన్నారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందినప్పటి నుంచీ టిజెఎసిని రద్దు చేయాలని కెసిఆర్ సూచిస్తున్నట్లు చెబుతున్నారు.
టిజెఎసిని రద్దు చేసే ప్రసక్తి లేదని, తెలంగాణ ఏర్పాటుతోనే తమ బాధ్యత తీరిపోలేదని, టిజెఎసి వాచ్ డాగ్ లాగా పనిచేస్తుందని, అధికారంలో ఏ పార్టీ ఉన్నా తాము ఆ పాత్ర నిర్వహిస్తామని, బంగారు తెలంగాణ కోసం పోరాటం చేస్తామని కోదండరామ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు. కెసిఆర్తో విభేదాలు ఏమీ లేవని, తమ మధ్య సంబంధం సామరస్యపూర్వకంగానే ఉంటుందని కూడా ఆయన అన్నారు. అయితే, టిజెఎసి కొనసాగడం కెసిఆర్కు ఇష్టం లేదని కత్తి వెంకటస్వామి అన్నట్లు టైమ్స్ ఇండియా రాసింది.