కెసిఆర్కు సీన్లేదు: డిఎస్, సోనియాతో చిరు వ్యూహాలు
హైదరాబాద్/నిజామాబాద్: తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ 75 స్థానాల్లో గెలుపొందడం ఖాయమని పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ బుధవారం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఆరితేరారని అయితే పాలనలో ఆయనకంత సీన్ లేదన్నారు.
తెరాసది దొరల పాలనే అన్నారు. మాట తప్పకపోవడం కాంగ్రెస్ అజ్ఞానమే ఐతే, తాము అజ్ఞానులమేనన్నారు. కెసిఆర్ మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో తెరాస అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్కే ఓటేస్తామని చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
ఖమ్మంలో షర్మిల
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగిస్తుందని ఆ పార్టీ నేత షర్మిల అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వైయస్ ఆశయ సాధన కోసమే తమ పార్టీ పుట్టిందన్నారు. తమ పార్టీని అందరు ఆశీర్వదించాలన్నారు.
బండారు వర్సెస్ అంజన్
సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు తగాదాలు బట్టబయలయ్యాయి. సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జైరాం రమేష్ను అంజన్ కుమార్ యాదవ్ తమ ఇంటికి రాకుండా చేశారని కార్తీక రెడ్డి ఆరోపిస్తున్నారు.
కరీంనగర్కు సోనియా
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం మధ్యాహ్నం హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు దిగ్విజయ్ సింగ్, టి కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి కరీంనగర్ బయలుదేరారు. సాయంత్రం ఐదు గంటలకు కరీంనగర్లో సభ జరగనుంది. అంతకుముందు డిగ్గీ మాట్లాడుతూ... మోడీ హవా అంతటా లేదన్నారు. ఎన్డీయే విజయం మీడియా సృష్టియే అన్నారు. మరోవైపు సోనియాతో చిరు భేటీ అయ్యారు. సీమాంధ్రలో మిగిలిన అభ్యర్థులు, ప్రచార వ్యూహంపై చర్చించారు.