గెలిపిస్తే సరే, లేదంటే ఇంటికెళ్లి నిద్రపోతా: కెసిఆర్ వ్యాఖ్య
నల్గొండ: రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపిస్తే తాను ఎవరు ఊహించని విధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తానని లేదంటే ఇంట్లో హాయిగా నిద్రపోతానని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా కోదాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
తెలంగాణను సాధించిన ఈ సమయంలో సన్నాసులకు అధికారం ఇస్తే సర్వనాశనం అవుతుందన్నారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ సాధించినా... కేంద్రం నుండి ఇంకా పలు అనుమతులు రావాల్సి ఉందన్నారు. అది తెరాసతోనే సాధ్యమన్నారు.
తెరాస ప్రభుత్వం వస్తేనే తెలంగాణకు మోక్షం అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు. చిన్న ఏమరుపాటు వల్ల మనం అరవై దశాబ్దాలుగా ఆంధ్రా పాలకుల చేతుల్లో నష్టపోయామన్నారు. తెరాస అధికారంలోకి వస్తే గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత మొదటి ఎన్నికలు ఎదుర్కొంటున్నామన్నారు. అరవయ్యేళ్ల క్రితం నాటి ఏమరుపాటుకు ఇన్నాళ్లు కష్టపడ్డామన్నారు. ఆంధ్రాతో ఇంకా పంచాయతీ తెగలేదన్నారు. జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నా చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు నాడు వైయస్ అడుగులకు మడుగులు ఒత్తారన్నారు.
మనోళ్లకు మంత్రి పదవులు ఇచ్చి సీమాంధ్రులు దర్జాగా నీళ్లు తరలించుకుపోయారన్నారు. ఉద్యమకారుల పైన జానారెడ్డి కేసులు పెట్టించారన్నారు. తెలంగాణ తెచ్చిన ఆనందం ముందు తనకు పదవులు తుచ్చమైనవన్నారు. తెలంగాణ తెచ్చిన సంతృప్తి వెయ్యి జన్మలకు సరిపోతుందన్నారు.
కేంద్రమంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి ఏనాడైనా తెలంగాణ కోసం పదవులు వదులుకున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, మోడీలకు తనను తిట్టుడే పనిగా ఎందుకన్నారు. జానా రెడ్డి ప్రజల కోసం మాట్లాడింది లేదన్నారు.
తాము అధికారంలోకి వస్తే రైతులకు లక్షలోపు రుణం, ఆటో, ట్రాలీ డైవర్లకు రవాణా పన్ను రద్దు, వృద్ధులు, వికలాంగులకు వెయ్యి రూపాయల పించన్, వికలాంగులకు రూ.1500 పింఛన్, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు. దళితుల అభివృద్ధికి రానున్న ఐదేళ్లలో 50వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. 14 సంవత్సరాల తెరాస పోరాట ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు.