ట్విస్ట్లు: ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు కేజ్రీ, బీజేపీలో అసంతృప్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసన సభ అంశంపై కొద్ది రోజులుగా ట్విస్ట్లు కొనసాగుతున్నాయి. ఢిల్లీ శాసన సభకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ను కోరారు. కేజ్రీవాల్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉదయం గవర్నర్ను కలుసుకున్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ను కలిసిన కేజ్రీవాల్ బృందం అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అనంతరం ఆ పార్టీ నేత మనీశ్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశంలేదని గవర్నర్కు చెప్పామని, తాజాగా ఎన్నికలు జరపాలని కోరామన్నారు. దీనిపై బీజేపీని సంప్రదిస్తానని, అటు రాష్ట్రపతితో కూడా మాట్లాడి ఓ నివేదిక అందిస్తాన్నారు.
నజీబ్ జంగ్తో భేటీ అనంతరం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీతో చర్చిస్తారని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ చెబితే.. ఆయన బలం నిరూపించుకోవాలని చెబుతారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
కాగా, బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ కూడా ఎన్నికలకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ తర్వాత వార్తలు వచ్చాయి. అయితే, మళ్లీ తాజాగా ఎన్నికలకు పోవడం పలువురు బీజేపీ ఎమ్మెల్యేలకు రుచించడం లేదట. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు వెళ్తే తాము గెలుస్తామా అనే ఆలోచనలో ఉన్నారట.