పవన్ని కాదని చంద్రబాబు నిర్ణయం: స్వీట్ పంచిన నాని
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జి కేశినేని నానికి విజయవాడ లోకసభ స్థానం ఖరారు కావడంతో ఆయన వర్గం శ్రేణులు సోమవారం సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేశినేని భవన్ వద్ద బాణసంచా పేల్చి మిఠాయిలు పంచారు. గత మూడు రోజులుగా విజయవాడ టిడిపి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు నాని వైపే బాబు మొగ్గు చూపారు.
కాగా, జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ సిఫార్సును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టినట్లుగా చెబుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్కు పవన్ సూచన మేరకు విజయవాడ లోకసభ టికెట్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
పొట్లూరి వరప్రసాద్కు విజయవాడ టికెట్ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ బిజెపి నేతలపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే, పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఫలించినట్లు లేదు. తెలుగుదేశం పార్టీ తరపున విజయవాడ లోకసభ నానిని బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట.
నానీని మార్చడం సరికాదంటూ చంద్రబాబుపై స్థానిక నేతల నుంచి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో నాని వైపే బాబు మొగ్గు చూపారట. కేశినేని నానిని చర్చల కోసం చంద్రబాబు హైదరాబాద్ పిలిపించారు. ఆయనతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ సూచనను పట్టించుకోలేదని తెలుస్తోంది.